
కిల్లర్ చిరుత కోసం గాలింపు
మైసూరు: జిల్లాలోని హుణసూరు తాలూకా నాగపుర హాడి సొళ్లెపుర అటవీ ప్రాంతంలో సోమవారం మేకలు మేపుతున్న హరీష్ అనే యువకున్ని ఓ చిరుత హతమార్చింది. దానిని పట్టుకోవడానికి అటవీ శాఖ సిబ్బంది కూంబింగ్ చేపట్టారు. పెంపుడు ఏనుగులతో గాలింపు సాగిస్తున్నారు. నాగరహొళె విభాగంలోని 30 మందికి పైగా సిబ్బంది పాల్గొంటున్నారు. హుణసూరు వలయంలోని హనగోడు కురుబర హొసహళ్లి గ్రామానికి చెందిన హరీష్ (24) తండ్రి కృష్ణతో కలిసి అటవీ శాఖ స్థలంలో మేకలు మేపుతుండగా, చిరుత వచ్చింది. దానిని తరిమేందుకు ప్రయత్నించగా అది హరీష్ మీద పడి తీవ్రంగా కొరికింది. తీవ్రంగా గాయపడిన హరీష్ను ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో చనిపోయాడు. హరీష్కు మూడు నెలల క్రితమే పెళ్లయింది.
రూ.20 లక్షల పరిహారం
మృతుడు హరీష్ కుటుంబానికి అటవీ శాఖ రూ.20 లక్షల పరిహారం ప్రకటించింది. హరీష్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, అక్కడికక్కడే రూ.5 లక్షల చెక్ను అందజేశారు. మిగతా రూ.15 లక్షల పరిహారధనం చెక్ను త్వరలో అందజేస్తామని డీసీఎఫ్ సీమా తెలిపారు.
డ్రోన్, ఏనుగులతో..
చిరుత ఆచూకీ కోసం ఒక పెద్ద బోను, నాలుగు చిన్న బోనులు, 15 కెమెరా ట్రాప్లు అమర్చారు. ఒక డ్రోన్ ద్వారా ఆకాశం నుంచి తనిఖీ చేస్తున్నారు. 2 కుంకీ ఏనుగులు కూడా పాల్గొంటున్నాయి. చిరుతను పట్టుకుంటామని అధికారులు తెలిపారు.
నవ వివాహితున్ని బలిగొన్న మృగం

కిల్లర్ చిరుత కోసం గాలింపు