
దొంగస్వాముల ముఠా అరెస్టు
కొత్తపల్లి(కరీంనగర్): ఇంటి సమీపంలోని గుప్త నిధులు వెలికితీస్తే అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులు ఆరోగ్యంగా మెరుగుపడతారని నమ్మబలికి మోసానికి పాల్పడ్డ దొంగస్వాముల గుట్టురట్టయ్యింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దొంగ స్వాములను కటకటాలకు పంపారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాశ్ వివరాల మేరకు కొత్తపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని ఎలగందుల అనుబంధ శ్రీరాముపల్లి గ్రామానికి చెందిన గజ్జి ప్రవీణ్ తండ్రి వేములవాడ డిపోలో ఆర్టీసీ డ్రైవర్ పనిచేస్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడగా కాలు విరిగింది. అతని తల్లి సైతం అనారోగ్యంతో బాధపడుతోంది. పదిరోజుల క్రితం ప్రవీణ్కు ఓ స్వామివేషంలో ఉన్న వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇంట్లో ఏంబాగా లేదని, ఇంటి పక్కన క్వింటాల్ వరకు బంగారు కడ్డీ ఉందని, దానిని బయటకు తీసి పూజలు చేస్తే కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా మెరుగవుతారని, లేకపోతే నెలరోజుల్లోనే చనిపోతారని నమ్మపలికాడు. భయపడ్డ ప్రవీణ్ పూజలు చేసేందుకు అంగీకరించగా, విడతలవారీగా రూ.3 లక్షలు, రూ.5 లక్షలు, రూ.10 లక్షలు మొత్తంగా రూ.15.30లక్షలు ప్రవీణ్ వద్ద వసూలు చేశాడు. ఓ రోజు ఇంటి సమీపంలో గొయ్యి తవ్వి పూజలు చేసినట్లు నటించాడు. గొయ్యిలోంచి ఓ డబ్బా బయటకు తీసి అందులో కిలో బంగారం ఉంటుందని దేవుని గదిలో దాచిపెట్టాలని సూచించాడు. మరికొంత డబ్బు కావాలని లేకుంటే తండ్రిని చంపి ఇక్కడే పాతిపెడతామని ప్రవీణ్ను బెదిరించగా, కొంత డబ్బు అప్పు చేసి వారికి ఇచ్చాడు. తరువాత మోసపోయానని గ్రహించి కొత్తపల్లి పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు చంద్రగిరికి చెందిన ఈర్నాల రాజు, ఆగ్రహారంకు చెందిన మిరియాల చంద్రయ్య, చీర్లవంచకు చెందిన పెనుగొండ రాజు, చల్లా అజయ్, ఈర్నాల సతీశ్ ముఠాగా ఏర్పడి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రూ.15.30 లక్షల నగదు, 7తులాల బంగారం, మూడు కార్లు, 7 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన కరీంనగర్ రూరల్ సీఐ ఏ.నిరంజన్రెడ్డి, కొత్తపల్లి ఎస్సై సాంబమూర్తి, ఏఎస్సై లక్ష్మారెడ్డిని సీపీ గౌస్ఆలం, ఏసీపీ శుభం ప్రకాశ్ అభినందించారు.
రూ.15,30 లక్షల నగదు, 7తులాల బంగారం, 3 కార్లు, 7సెల్ఫోన్లు స్వాధీనం