
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
● రూ.4.12లక్షల ఆభరణాలు, నగదు చోరీ
● ఐదుగురిపై కేసు, ఇద్దరి అరెస్ట్
● వివరాలు వెల్లడించిన సీపీ గౌస్ ఆలం
కరీంనగర్క్రైం: తాళం వేసిఉన్న ఇళ్లలో చోరీ చేసిన కేసులో ఇద్దరిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు కమిషనరేట్లో శుక్రవారం సీపీ గౌస్ఆలం నిందితుల వివరాలను వెల్లడించారు. ఆయన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటకు చెందిన గాజుల హేమంత్, గతంలో జైలులో పరిచయమైన ఇద్దరితో కలిసి బైకు దొంగిలించారు. ముగ్గురు కలిసి ఈ నెల8న కరీంనగర్ నుంచి జగిత్యాల వైపు వెళ్తున్నారు. గంగాధర మండలం వెంకటాయపల్లిలోని తాళం వేసిఉన్న ఉప్పుగండ్ల గంగారెడ్డి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. బీరువాలోని రూ.3.87లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు దొంగలించారు. ఆ బంగారంలో కొంత కోనరావుపేటకు చెందిన కొమ్ము నవీన్, మానకొండూర్కు ఓ వ్యక్తికి విక్రయించారు. మరికొంత ప్రైవేట్ ఫైనాన్స్లో కుదవబెట్టి రూ.64వేలు తీసుకున్నారు. మిగితా పంచుకున్నారు. బాధితుడు గంగారెడ్డి ఫిర్యాదుతో గంగాధర పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. సీపీ గౌస్ ఆలం ఆదేశాలతో కరీంనగర్రూరల్ ఏసీపీ శుభం ప్రకాశ్ ఆధ్వర్యంలో వివరాలు సేకరించారు. చోరీ చేసిన ముగ్గురు, బంగారాన్ని కొన్న ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు హేమంత్ను గంగాధర క్రాస్రోడ్డు వద్ద శుక్రవారం అరెస్టు చేశారు. అతడి సమాచారంతో కొమ్ము నవీన్ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 20తులాల బంగారం, 25తులాల వెండి, ఒక బైక్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని సీపీ వెల్లడించారు. ఏసీపీ శుభం ప్రకాశ్, చొప్పదండి సీఐ ప్రదీప్, క్లూస్టీం సీఐ రాజు, గంగాధర ఎస్సై వంశీకృష్ణ, సీసీఎస్ ఎస్సై నాగరాజు సిబ్బందిని అభినందించారు.