
బర్త్, డెత్ సర్టిఫికెట్లు రావట్లే
● బొమ్మకల్, కొత్తపల్లిలో వింత పరిస్థితి ● ఆన్లైన్లో లభ్యం కాని వివరాలు ● ఆయా ప్రాంతాల్లో నిలిచిన బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ ● సీడీఎంఏ ఆదేశించినా, పరిష్కరించని మీసేవ డిపార్ట్మెంట్ ● పొరపాటుపై బల్దియా, సీడీఎంఏ పరస్పర ఆరోపణలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
ఇటీవల కరీంనగర్ బల్దియాలో విలీనమైన గ్రామాలు బాలారిష్టాలు ఎదుర్కొంటున్నాయి. నేటికీ పలు విభాగాల వివరాలు కరీంనగర్ కార్పొరేషన్కు అనుసంధానం కాకపోవడంతో విలీన గ్రా మాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా జనన, మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్లు జారీ కాక బొమ్మకల్తో పాటు కొత్తపల్లి మున్సిపల్ పరిధిలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
జనవరిలో విలీనం
ఈ ఏడాది జనవరిలో నగరపాలక సంస్థలో చింతకుంట, మల్కాపూర్, బొమ్మకల్, దుర్శేడ్, గోపాల్పూర్తోపాటు కొత్తపల్లి మున్సిపాలిటీని విలీనం చేశారు. బల్దియా అధికారులు ఆయా గ్రామ పంచాయతీల రికార్డులు, జనన మరణాల రిజిష్టర్లు స్వాధీనం చేసుకున్నారు. జనన, మరణ మీసేవ ఆన్లైన్ డేటా.. ఫిబ్రవరి వరకు నగరపాలక సంస్థ మీసేవ పోర్టల్లో విలీనం కావాలి. కానీ పాత డేటా విలీనం కాకపోవడంతో ఆన్లైన్లో వివరాలు కనిపించక మీసేవలో దరఖాస్తు చేసుకోవడంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై సీడీఎంఏ, బల్దియా తప్పు మీదంటే.. మీదంటూ పరస్పర ఆరోపణలకు దిగుతున్నారు.
కనిపించని వివరాలు
బల్దియాలో ఏప్రిల్ తరువాత దరఖాస్తు చేసుకున్నవారికి జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు వస్తున్నాయి. ఫిబ్రవరి కన్నా ముందు చోటు చేసుకున్న జనన, మరణ సర్టిఫికెట్లు ఆన్లైన్లో చూపించడం లేదు. ఈ విషయమై పలువురు నగరపౌరులు సీడీఎంకేకు ఫిర్యాదు చేశారు. సమస్యను పరిష్కరించాలని సీడీఎంఏ మీసేవ విభాగాన్ని ఆదేశించింది. చింతకుంట, మల్కాపూర్, దుర్శేడ్, గోపాల్పూర్ గ్రామాలకు సంబంధించి నాలుగు అదనపు లిస్టులను కరీంనగర్ నగరపాలక సంస్థ– మీసేవ లాగిన్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. బొమ్మకల్, కొత్తపల్లి జనన మరణ రికార్డులు ఇంకా కరీంనగర్ నగరపాలక సంస్థ జనన మరణ రికార్డుల విభాగా నికి జత కాలేదు. దీంతో బొమ్మకల్, కొత్తపల్లి పరిధిలో ఈ ఏడాది ఫిబ్రవరికి ముందు జరిగిన జన న, మరణాల సర్టిఫికెట్లు పొందలేకపోతున్నారు. మీసేవాలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. ఆ డేటా కరీంనగర్ బల్దియాతో అనుసంధానం కాకపోవడం వల్ల ప్రాసెస్ చేయలేకపోతున్నారు. ముఖ్యంగా బొమ్మకల్, పరిధిలో ఓ ప్రైవేటు మెడికల్ కళాశాలలో రోజూ పదుల సంఖ్యలో జనన, మరణాలు జరుగుతుంటాయి. ఈ ఆసుపత్రికి ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ నుంచి ప్రజలు ప్రసూతి సేవల కోసం వస్తుంటారు. దీంతో వీరంతా సర్టిఫికెట్లు పొందడంలో ఇబ్బందులు పడుతున్నారు.
సీడీఎంఏ, బల్దియా పరస్పర ఆరోపణలు
ఈ విషయమై ‘సాక్షి’ సీడీఎంఏ అధికారి చక్రధర్ని సంప్రదించగా... తాము ఇదివరకే పా త డేటా ఎలా అనుసంధానం చేయాలో వివరిస్తూ ప్రొసీజర్ పంపామని బదులిచ్చారు. వారు దాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోవడంతో సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. బల్దియా అధికారులు సీడీఎంఏ వద్దే సమస్య ఉందని కుండబద్దలు కొడుతున్నారు. ప్రజలకు అత్యవసరమైతే మాన్యువల్గా సర్టిఫికెట్లు ఇస్తున్నామని స్పష్టం చేశారు.

బర్త్, డెత్ సర్టిఫికెట్లు రావట్లే