
విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి
కరీంనగర్క్రైం: విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.వెంకటేశ్ సూచించారు. ప్రపంచ బాల కార్మికుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా గురువారం నగరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల(గంజ్)లో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. విద్యార్థులకు బాల కార్మికుల నిర్మూలన కోసం ఉన్న చట్టాలపై అవగాహన కల్పించారు. తప్పు చేసినా.. నిజాయితీగా ఉండాలని, చదువుపై శ్రద్ధ వహించాలని సూచించారు. ఎలాంటి చట్ట పరమైన సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేశ్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మోదీ పాలన భారత్ను విశ్వవేదికపై నిలబెట్టింది
కరీంనగర్టౌన్: 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ మోదీ ప్రభుత్వం, 11ఏళ్లలో దేశ దిశాదశను మార్చిందని, భారత వైభవాన్ని విశ్వవేదికపై నిలబెట్టిందని పార్టీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తల్లోజు ఆచారి పేర్కొన్నారు. అధిష్టానం పిలుపుమేరకు 11ఏళ్ల మోదీ ప్రభుత్వం– సంకల్ప సాకారం పేరిట చేపట్టిన కార్యక్రమంలో భాగంగా గురువారం కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్తో దేశానికి, ప్రపంచానికి ప్రధాని మోదీ నాయకత్వాన్ని చూపెట్టారన్నారు. మేకిన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్, వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ పాలన కొనసాగుతోందన్నారు. అంతకుముందు 11ఏళ్ల మోదీ ప్రభుత్వ ప్రస్థానంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మహిళా మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షులు గీతామూర్తి, మాజీ మేయర్ సునీల్రావు తదితరులు పాల్గొన్నారు.
బస్పాస్ల చార్జీలు తగ్గించాలి
కరీంనగర్: ఆర్టీసీ బస్పాస్ చార్జీలు 20శాతం నుంచి 50శాతం పెంచడం అన్యాయమని, వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్పాస్ ధరలు పెంచుతూ పేద, మధ్యతరగతి విద్యార్థులపై భారం మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే స్కాలర్షిప్లు రాక విద్యార్థుల తల్లిదండ్రులపై పెనుభారం పడుతోందన్నారు. విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బస్సు చార్జీలు పెంచుతున్నట్లు బహిరంగ ప్రకటన చేయకుండానే, దొడ్డి దారిన రేషనలైజేషన్ పేరిట చార్జీలు పెంచి ప్రయాణికులపై భారాన్ని మోపుతున్నారని అన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు గీట్ల ముకుందరెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు ఎడ్ల రమేశ్, జిల్లా నాయకులు జి.తిరుపతినాయక్, పుల్లెల మల్లయ్య, వినయ్సాగర్ పాల్గొన్నారు.
14న జాతీయ లోక్ అదాలత్
● సీపీ గౌస్ ఆలం
కరీంనగర్క్రైం: జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టుల్లో ఈనెల14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారని సీపీ గౌస్ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లోక్ అదాలత్లో రాజీ చేయదగిన సివిల్, క్రిమినల్, ఫ్యామిలీ, బ్యాంక్, చెక్బౌన్స్, మోటార్ ప్రమాద కేసులతోపాటు కోర్టుకు రాని మొదలగు కేసులు పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. తమ కేసులు రాజీ చేసుకోవాలంటే కక్షిదారులు సంబంధిత పోలీసులను కాని, న్యాయసేవ అధికార సంస్థను కాని సంప్రదించి రాజీ చేసుకోవచ్చని సూచించారు.

విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి

విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి