కరీంనగర్: బడీడు పిల్లలను పనికి పంపొద్దని జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి సూచించారు. బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సరస్వతి మాట్లాడుతూ.. బడికి పంపాల్సిన పిల్లలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. కౌమార దశ కార్మిక నిషేధ నియంత్రణ చట్టం–2016 ఉల్లంఘిస్తే రూ.25వేల జరిమానా, జైలు శిక్ష ఉంటుందన్నారు. జిల్లాలో బాలకార్మికులను గుర్తిస్తే చైల్డ్ హెల్ప్లైన్ టోల్ ఫ్రీ నంబర్ 1098 లేదా 94908 81098కు సమాచారం ఇవ్వాలన్నారు.