
చిన్నారులను అంగన్వాడీల్లో చేర్పించండి
● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్: పిల్లల మానసిక వికాసానికి, శారీరక ఎదుగుదలకు అంగన్వాడీల్లో చేర్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. నగరంలోని కార్ఖానాగడ్డ అంగన్వాడీ కేంద్రంలో ప్రారంభ వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. మూడేళ్లనుంచి ఆరేళ్లలోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని అన్నారు. ఈ నెల 17వరకు అమ్మమాట–అంగన్వాడీ బాట కార్యక్రమం ద్వారా ఎక్కువ మంది చేరేలా చూడాలని ఐసీడీఎస్ సిబ్బందికి సూచించారు. చిన్నారులకు స్వయంగా ఎగ్ బిర్యానీ వడ్డించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, సీడీపీవో సబిత తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా
కరీంనగర్ అర్బన్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక సరఫరా చేసేందుకు టోకెన్ పద్ధతి ప్రవేశపెట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో మైనింగ్, రెవెన్యూ, గృహ నిర్మాణ సంస్థ, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. ప్రతీ గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాతో టోకెన్ల జారీ విధానంపై ప్రణాళిక రూపొందించాలన్నారు. లబ్ధిదారుని గృహ నిర్మాణ అవసరాన్ని బట్టి టోకెన్లు జారీ చేయాలన్నారు. గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి, ఏఈలు ఇసుక టోకెన్ల జారీని చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్దేశాయ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్బాబు, మైనింగ్ ఏడీ రాఘవరెడ్డి, హౌసింగ్ పీడీ గంగాధర్ పాల్గొన్నారు.