
వ్యాపారాలు ప్రారంభించాలి
కరీంనగర్ కార్పొరేషన్: పద్మనగర్ మార్కెట్లో స్టాళ్లు, షెట్టర్లు పొందిన వ్యాపారులు తమ వ్యాపారాలు ప్రారంభించాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్ ఆదేశించారు. మంగళవారం పద్మనగర్ సమీకృత మార్కెట్ను సందర్శించారు. వ్యాపారాలు చేసుకునేందుకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. ఇప్పటికే స్టాళ్లు, షెట్టర్లు పొంది, నగరపాలకసంస్థలో రిజిస్ట్రేషన్ చేసుకొన్న వ్యాపారులు తమ వ్యాపారాలను ప్రారంభించాలన్నారు. మిగతావారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొని అమ్మకాలు జరపాలన్నారు. డీఈ వెంకటేశ్వర్లు, ఏఈ సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
సాగులో సలహాలు పాటించాలి
కరీంనగర్రూరల్: వానాకాలం పంటల సాగులో రైతులు శాస్త్రవేత్తల సలహాలు, సూచనలను పాటించి అధిగ దిగుబడి సాధించాలని జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి కోరారు. దుర్శేడ్ రైతువేదికలో మంగళవారం రైతుముంగిట్లో శాస్త్రవేత్తలు, వికసిత కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు యూరియా తగ్గించి, సేంద్రియ ఎరువులను వినియోగించాలన్నారు. అనంతరం పలువురు శాస్త్రవేత్తలు పంటల సాగు విధానం, యాజ మాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. శాస్త్రవేత్తలు ఉషారాణి, విజయభాస్కర్, వేణుగోపాల్, జిల్లా ఉద్యానశాఖాధికారి శ్రీనివాస్ రావు, వెటర్నరీ డాక్టర్ రామకృష్ణ, ఏవో సత్యం, ఏఈవో పైడితల్లి, మౌనిక, దుర్శేడ్ సింగిల్ విండో చైర్మన్ తోట తిరుపతి పాల్గొన్నారు.
శ్వేతపత్రం విడుదల చేయాలి
కరీంనగర్: కరీంనగర్ ఎంపీగా ఐదేళ్లు, కేంద్ర సహాయ మంత్రిగా ఏడాదికాలంగా ఉన్న బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమిటో శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ డిమాండ్ చేశారు. మీసేవ కార్యాలయంలో మంగళవారం మాట్లాడుతూ.. ఈజీఎస్, అమృత్ లాంటి అన్గోయింగ్ పథకాల పనులను చూపెట్టి, లెక్కలు వేస్తూ అభివృద్ధి చేశామని సంబరాలు నిర్వహించుకోవడం బీజేపీకే చెల్లిందని ఎద్దేవా చేశారు. జిల్లాకు సైనిక్స్కూల్, నవోదయ పాఠశాలలు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. వేములవాడ, కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాలను ప్రసాద్ స్కీంలో చేర్పించించాలని, కరీంనగర్– తిరుపతి రైలు ప్రతీరోజు నడిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. కరీంనగర్ అభివృద్ధికి రూ.200 కోట్లు మంజూరు చేయించాలన్నారు. కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. కొత్తపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ రుద్ర రాజు, మాజీ వైస్ ఎంపీపీ తిరుపతినాయక్, నాయకులు గడ్డం ప్రశాంత్రెడ్డి, చందు పాల్గొన్నారు.
‘ఆరోగ్య మహిళ’ను సద్వినియోగం చేసుకోవాలి
జమ్మికుంట: మహిళలు ఆరోగ్య మహిళ వైద్య పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్వో వెంకటరమణ సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళ వైద్య పరీక్షల కేంద్రాన్ని మంగళవారం డిప్యూటీ డీఎంహెచ్వో చందు, ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీకాంత్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ.. ప్రతీ మంగళవారం, శుక్రవారం ఆరోగ్య మహిళ శిబిరం నిర్వహిస్తామని, వైద్యుల సూచనల మేరకు 56రకాల పరీక్షలు చేస్తారన్నారు. ప్రతీ మహిళ మూడు నెలలకు ఒక్కసారి వైద్య పరీక్షలు చేసుకోవాలన్నారు. అనంతరం ఆరోగ్య ఉపకేంద్రం–1ను తనిఖీ చేశారు. డాక్టర్లు సనా జవేరియా, చందన, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్రెడ్డి పాల్గొన్నారు.

వ్యాపారాలు ప్రారంభించాలి

వ్యాపారాలు ప్రారంభించాలి