
నేడే అభ్యంతరాలకు ఆఖరు
● పునర్విభజన సవరణలపై మొదలైన పరిశీలన ● డివిజన్లవారీగా బల్దియా అధికారుల పర్యటన
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని 60 డివిజన్లను 66 డివిజన్లుగా పునర్విభజిస్తూ నగరపాలకసంస్థ జారీ చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్కు సంబంధించిన అభ్యంతరాల గడువు బుధవారంతో ముగియనుంది. ఈ నెల 4వ తేదీన 66 డివిజన్లతో కూడిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను జారీ చేయగా, 5వ తేదీ నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తుండడం తెలిసిందే. ఇందుకోసం నగరపాలకసంస్థ కార్యాలయంలో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేశారు. మంగళవారం 39 అభ్యంతరాలు రాగా, ఇప్పటివరకు మొత్తంగా 139 అభ్యంతరాలు వచ్చాయి.
నేటితో ముగియనున్న గడువు
డివిజన్ల పునర్విభజనకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే చెప్పాలంటూ నగరపాలకసంస్థ వారం రోజుల పాటు సమయం ఇచ్చింది. 5వ తేదీ నుంచి మొదలైన అభ్యంతరాల స్వీకరణ 11వ తేదీ బుధవారంతో ముగియనుంది. 66 కొత్త డివిజన్లకు సంబంధించి ఇప్పటివరకు 139 అభ్యంతరాలు రాగా, బుధవారం ఎక్కువస్థాయిలో వచ్చే అవకాశం ఉంది. గత పునర్విభజనతో పోల్చితే ఈ సారి అభ్యంతరాలు తక్కువగా రావడం గమనార్హం. అభ్యంతరాల్లోనూ ఎక్కువగా డివిజన్లలో ఓట్లసంఖ్య ఆధారంగా సవరణ చేయడం, భౌగోళిక ఆధారంగా ఇళ్లను ఆయా డివిజన్లలోకి మార్చడంపైనే వచ్చాయి. పాత 49వ డివిజన్ను అశాసీ్త్రయంగా విభజించి కొత్త 56వ డివిజన్ను చేశారంటూ డివిజన్ కాంగ్రెస్ నాయకుడు జాగిరి సాగర్ గౌడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. బోయవాడలోని 1–6–1 నుంచి 1–6–216 వరకు ఉన్న ఇళ్లను కలిపి ఒక డివిజన్గా మార్చాలని వినతిపత్రం ఇచ్చారు. భౌగోళికంగా వేర్వేరుగా ఉన్న గోపాల్పూర్, దుర్శేడ్ను కలిపి చేసిన 3వ డివిజన్ను మార్చాలని గోపాల్పూర్ మాజీ సర్పంచ్ ఊరడి మంజుల మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు.గోపాల్పూర్ పరిసరాలను కలిపి స్వంతంత్ర డివిజన్గా మార్చాలన్నారు.
అభ్యంతరాల పరిశీలన మొదలు
డివిజన్ల పునర్విభజనపై వచ్చిన అభ్యంతరాల వారిగా అధికారులు ఇప్పటికే పరిశీలన మొదలు పెట్టారు. షెడ్యూల్ ప్రకారం 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అభ్యంతరాల పరిశీలన చేయాలి. హడావుడికి తావివ్వకుండా ఉండేందుకు అంతకుముందుగానే అభ్యంతరాలపై ఆయా డివిజన్లలో పట్టణ ప్రణాళిక అధికారులు పరిశీలన చేపట్టారు. రోజువారీగా వచ్చిన అభ్యంతరాల ఆధారంగా సంబంధిత డివిజన్లకు వెళ్లి, ఓట్లు, ఇళ్లు, హద్దుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. అభ్యంతరాలు వాస్తవమని తేలితే వాటిని సవరించనున్నారు.