
చదువుతో పాటు నైపుణ్యం తప్పనిసరి
● కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్: చదువుతోపాటు నైపుణ్యం తప్పనిసరి అని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో 42 రోజులుగా నిర్వహిస్తున్న టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ కోర్స్ ముగింపు కార్యక్రమం మంకమ్మతోటలోని ప్రభుత్వ (ధన్గర్వాడీ) పాఠశాలలో మంగళవారం జరిగింది. టైలరింగ్, డ్రాయింగ్, ఎంబ్రాయిడరీ విభాగాల్లో శిక్షణ పొందిన 769 మంది సిద్ధం చేసిన పలు రకాల ఆర్ట్ క్రాఫ్ట్, డ్రెస్ మెటీరియల్, పెయింటింగ్స్తో ప్రదర్శన ఏర్పాటు చేశారు. తిలకించిన కలెక్టర్ వారి సృజనాత్మకతను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్స్ శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఇందులో కరీంనగర్ జిల్లా ఉందని, 769మంది శిక్షణకు హాజరయ్యారని తెలి పారు. అంగన్వాడీ, బాలసదన్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కావలసిన డ్రెస్ మెటీరియల్ కుట్టి ఇవ్వడం ద్వారా టైలరింగ్లో నైపుణ్యం సాధించడంతో పాటు విద్యార్థులకు సాయం చేసినవారు అవుతారని తెలిపారు. నేటి రోజుల్లో చదువు మాత్రమే కాకుండా జీవన నైపుణ్యం తప్పనిసరిగా మారిందని అన్నారు. కోర్సును విజయవంతంగా పూర్తి చేసినివారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఇన్చార్జి డీఈవో ఆంజనేయులు, జిల్లా సైన్స్ అధికారి జైపాల్రెడ్డి, బాలికల అభివృద్ధి అధికారి కృపారాణి, సూపరింటెండెంట్ నరసింహస్వామి పాల్గొన్నారు.
నాణ్యమైన భోజనం అందించాలి
రామడుగు: ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. జిల్లాలోని కస్తూరిబా గాంధీ, బాలికల రెసిడెన్షియల్ పాఠశాలల వసతి గృహాల్లో వంటచేసే 90 మంది సిబ్బందికి రామడుగు మండలంలోని వెదిర కస్తూరిబాలో మంగళవారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణను కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించి, పలు రకాల వంటకాలను రుచి చూశారు. తహసీల్దార్ రాజేశ్వరీ, జిల్లా బాలికల అభివృద్ధి అధికారి కృపారాణి, కస్తూరిబా ప్రిన్సిపాల్ కవిత పాల్గొన్నారు.