
వారసులకే వర్తింపు
రామగుండం: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కటాఫ్ తేదీని పెంచలేదు. దీంతో లబ్ధిదారుల మరణానంతరం వారసులకే పథకం వర్తిస్తోంది. కొత్తగా భూములు కొనుగోలు చేసిన వందలాది మంది రైతులు ఈ పథకానికి నోచుకోవడంలేదు.
ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు..
కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రారంభించింది. దేశవ్యాప్తంగా అర్హతలు కలిగిన రైతు కుటుంబాలకు సాగు దశలో ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు ఈ పథకం రూపొందించింది. ఇందులో భాగంగా రూ.ఆరువేల నగదును ఏడాదిలో మూడు విడతలుగా నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో జమచేస్తూ వస్తోంది. పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 19 విడతలుగా అర్హులైన రైతులకు పరిహారం అందజేసింది.
2019 లోపు రిజిష్ట్రేషన్ ఉన్న రైతులకు వర్తింపు..
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఆరంభం నుంచి ఉన్న రైతులకే ఆర్థిక సాయం అందుతోంది. 2019 తర్వాత భూ క్రయవిక్రయాలు జరిపిన వారిని అనర్హులుగా గుర్తిస్తున్నారు. ఫలితంగా రైతులు రాష్ట్రప్రభుత్వం అందించే రైతు భరోసాపైనే ఆధారపడుతున్నారు. పీఎం కిసాన్ పథకంలో గతంలో ఉన్న లబ్ధిదారు మృతి చెందితే వారసులకే ఆర్థిక సాయం అందుతోంది. కొత్త రైతులు చేసుకున్న దరఖాస్తులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. 2025 మేలో కొత్త రైతుల వివరాల నమోదుపై అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.
అదనంగా 7వేల మందికే..
జిల్లాలోని 61,747 మంది రైతులకే పథకం ఆరంభంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అందింది. లబ్ధిదారులు మృతి చెందాక వారసులు ఆ భూములు పంచుకొని తమ వివరాలను పీఎం కిసాన్ పోర్టల్లో నమోదు చేసుకున్నారు. ఇలాంటి వారికి సైతం ఈ పథకం వర్తించింది. వీరు జిల్లావ్యాప్తంగా సుమారు 7,340 మంది ఉన్నట్లు గుర్తించగా.. అదనంగా వీరే ప్రయోజనం చేకూరుతోంది. 2019 తర్వాత భూక్రయ విక్రయాలు చేసిన వారికి పైసా సాయం అందడంలేదు.
కటాఫ్ తేదీ పెంచకపోవడంతో వర్తించని పీఎం కిసాన్ పథకం
కేంద్ర పథకానికి నోచుకోలేక పోతున్న వందలాది రైతులు