
‘రాజన్న కోడెల మృతికి కారణం దేవాదాయశాఖ మంత్రి’
వేములవాడఅర్బన్: వేములవాడ రాజన్న కోడెల మృతికి కారణం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అని బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు విమర్శించారు. ఆదివారం వేములవాడ రాజన్న గోశాలను నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, రాజన్న ఆలయానికి భక్తులు సమర్పించిన కోడెలు 33 మృతి చెందాయన్నారు. తప్పంతా వారే చేసి ఎదుటివారిపై బురదజల్లినట్లుగా మంత్రి తీరు ఉందన్నారు. తన సిఫారసు లేఖ ద్వారా గీసుకొండకు చెందిన రాంబాబు అనే వ్యక్తికి అక్రమ పద్ధతిలో అధికారులపై ఒత్తిడి తెచ్చి 60 కోడెలను ఇచ్చింది నిజం కాదా అని అన్నారు. గీసుకొండ పోలీస్స్టేషన్లో కేసు నమోదై రాంబాబు జైలుకు వెళ్లిన విషయంపై మీడియాలో కథనాలు వచ్చాయన్నారు. భక్తుల విశ్వాసం, నమ్మకానికి ప్రతీకై న కోడెల మృత్యువాతలో మొదటి ముద్దాయి మంత్రి సురేఖ అన్నారు. కోడెల పంపిణీ నిలిచిపోయి గోశాలలో 500 ఉండాల్సిన చోట 1,300 పరిమితికి మించి పోయాయన్నారు. పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్రెడ్డి, న్యాలకొండ రాఘవరెడ్డి, మ్యాకల రవి, గోస్కుల రవి, పోలాస నరేందర్ తదితరులు ఉన్నారు.
గోశాలలో మరో కోడె మృతి
తిప్పాపూర్లోని రాజన్న గోశాలలో ఆదివారం అనారోగ్యంతో ఒక కోడె మృతిచెందినట్లు జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్రెడ్డి ప్రకటనలో తెలిపారు. గోశాలలో ఉన్న 1,300 కోడెలలో ప్రస్తుతం మొత్తం 11 కోడెలకు వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. కోడెల ఆరోగ్య సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.