
బైపాస్ పనులకు బ్రేక్!
● పెద్దపల్లి రైల్వే బైపాస్ లైన్లో అనూహ్య మలుపు! ● తొలుత మే నెలాఖరుకు ప్రారంభిస్తారని ప్రచారం ● పనులు జరుగుతున్న తీరుపై అధికారుల అసంతృప్తి? ● పూర్తి అయ్యేందుకు మరింత సమయం ● ఐఆర్సీటీసీలో కానరాని కరీంనగర్– తిరుపతి రైలు ● నిజామాబాద్ వరకు పొడిగింపుపై ఉత్కంఠ
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
జగిత్యాల– పెద్దపల్లి సెక్షన్లోని బైపాస్ రైల్వేలైన్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఇటీవల పనులు వేగంగా సాగాయి. కానీ.. అకస్మాత్తుగా పెద్దపల్లి బైపాస్లో పనులు నిలిచిపోయాయని సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పెద్దపల్లి బైపాస్ పనులు నిబంధనల మేరకు జరగడం లేదని, పనుల్లో నాణ్యతపై ఉన్నతాధికారులు అసంతృప్తిగా ఉన్నారని, తదుపరి ఆదేశాలు వచ్చేసరికి పనులు నిలిపివేయాలని ఆదేశించినట్లు తెలిసింది. దీంతో వచ్చే నెలాఖరును ప్రారంభం కావాల్సిన రైల్వేలైన్ మరికాస్త ఆలస్యం కానుందని సమాచా రం. వాస్తవానికి మార్చి ఆఖరునాటికి బైపాస్ పనులు పూర్తయ్యాయని ప్రచారం జరిగింది. మార్చి 28 నుంచి ఇంటర్లాకింగ్ పనులు మొదలవుతాయని, ఉగాది కల్లా పనులు పూర్తవుతాయని, ఉన్నతాధికారులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశాక.. మే నెలాఖరునాటికి బైపాస్ లైన్ను అందుబాటులోకి తీసుకువస్తారని అనుకున్నారంతా. కానీ, అనూహ్యంగా ఇటీవల ఇంటర్లాకింగ్ పను ల పరిశీలనకు వచ్చిన రైల్వే ఉన్నతాధికారులు పనులు నిబంధనల ప్రకారం జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిసింది. మొత్తం 1.78 కిమీ పొడవున్న రైల్వేలైన్లో 500 మీటర్ల వరకు కొన్ని మార్పులు చేయాలని సూచించినట్లు సమాచారం. దీంతో బైపాస్ రైల్వేలైన్ ప్రారంభం మరింత ఆలస్యం కానుంది.
జూన్ నుంచి కానరాని కరీంనగర్– తిరుపతి రైలు
కరీంనగర్ నుంచి పెద్దపల్లి మీదుగా తిరుపతివెళ్లే కరీంనగర్– తిరుపతి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు మొన్నటి వరకు మే 29 తేదీ నుంచి పెద్దపల్లిలో ఆగకుండా నేరుగా బైపాస్ మీదుగా వెళ్తుందని ప్రచారం జరిగింది. దీన్ని బలపరుస్తూ ఐఆర్సీటీసీ పోర్టర్లోనూ మే 29 తరువాత పెద్దపల్లి రైల్వేస్టేషన్ కనిపించలేదు. జూన్ 1 నుంచి కరీంనగర్–తిరుపతి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ఐఆర్సీటీసీ పోర్టర్లో కానరావడం లేదు. దీనికి కారణాలు అంతుచిక్కడం లేదు. ప్రస్తుతం బైవీక్లీగా ఉన్న ఈ సర్వీసు కరీంనగర్కు ఉదయం 8.15 గంటలకు వస్తుంది. ఆ తరువాత సాయంత్రం 7.15 గంటలకు తిరిగి తిరుపతి బయల్దేరుతుంది. ఈనేపథ్యంలో ఈ రైలును నిజామాబాద్ వరకు పొడగిస్తారని ప్రచారం సాగుతోంది. మొత్తానికి ఈ రైలును పొడిగిస్తారా? లేదా సర్వీసును వారానికి ఐదురోజుల పెంచుతారా? అన్నది ఉత్కంఠ రేపుతోంది.
పెద్దపల్లి రైల్వేబైపాస్లో స్టేషన్ కట్టాల్సిందే
అదే సమయంలో బైపాస్ రైల్వే లైన్ వద్ద హాల్టింగ్ లేకుండా ప్రారంభమైతే.. తాము తిరుపతి వెళ్లేందుకు అవకాశం కోల్పోతామని పెద్దపల్లిలో రైలెక్కే మంచిర్యాల, రామగుండం, బెల్లంపల్లి, లక్షెట్టిపేట, సిర్పూర్ కాగజ్నగర్, చెన్నూరు, ధర్మారం, ఆసిఫాబాద్ భక్తులు ఆందోళన చెందుతున్నారు. లేకపోతే గతంలోలా తామంతా కాజీపేట వరకు ప్రయాణం చేసి పద్మావతి లాంటి రైళ్లను అందుకోవాల్సి వస్తుందని, ఇది దూరాభారంతోపాటు తమకు సమయం కూడా వృథా అవుతుందని వాపోతున్నారు. దీనికి పరిష్కారంగా పెద్దపల్లి బైపాస్ క్యాబిన్ వద్ద రైల్వేస్టేషన్ నిర్మించి, తిరుపతి–కరీంనగర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకు హాల్టింగ్ ఇవ్వాలని కోరుతున్నారు.

బైపాస్ పనులకు బ్రేక్!

బైపాస్ పనులకు బ్రేక్!