పెరిగిన రేషన్ కోటా
దోమకొండ: ఉమ్మడి జిల్లాలో లబ్ధిదారులకు రేషన్ కార్డుల మంజూరు నిరంతరాయంగా సాగుతోంది. ప్రతినెలా కార్డుల మంజూరుతోపాటు కోటా సైతం పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో తీసుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. బియ్యం పంపిణీ ప్రారంభించగానే ఠంచనుగా రేషన్ దుకాణాలకు వెళ్లి తీసుకువెళ్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో..
ఉమ్మడి జిల్లాకు కొత్తగా 80,538 కార్డులు మంజూరయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 4,92,806 కార్డులు ఉండగా, 16,38,839 మంది లబ్ధిదారులు ఉన్నారు. అయితే జిల్లాకు కొత్తగా 45,240 కొత్త కార్డులు మంజూరయ్యాయి. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో మొత్తం 2,88,553 రేషన్కార్డులు ఉండగా, 8,61,131 మంది లబ్ధిదారులు ఉన్నారు. జిల్లాకు 35,298 మందికి కొత్త రేషన్కార్డులు మంజూరయ్యాయి.
రేషన్కార్డులకు అనుగుణంగా రేషన్ దుకాణాల సంఖ్య కూడా పెరగాల్సి ఉంది. నిజామాబాద్ జిల్లాలో కార్పొరేషన్, మున్సిపాలిటీలతోపాటు 545 గ్రామ పంచాయతీలు ఉండగా, 759 రేషన్ దుకాణాలు ఉన్నాయి. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో మూడు మున్సిపాలిటీలు, 22 మండలాలు, 532 గ్రామ పంచాయతీల పరిధిలో 578 రేషన్ దుకాణాలు ఉన్నాయి. కాగా కొత్త గ్రామ పంచాయతీలు, వార్డులు ఏర్పాటైనప్పటికీ దుకాణాల సంఖ్య మాత్రం పెంచడం లేదు. కొత్తగా రేషన్కార్డులు మంజూరు చేస్తున్న నేపథ్యంలో దుకాణాల సంఖ్య సైతం పెరగాల్సి ఉంది. పలు మండలాల పరిధిలో పౌర సరఫరాలశాఖ ఆధ్వర్యంలో గోదాములు ఏర్పాటు చేసి అక్కడి నుంచి రేషన్ దుకాణాలకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నారు. కొత్తగా ఆహార భద్రత కార్డులను ప్రభుత్వం అందజేయగా సన్నబియ్యం పంపిణీ జరుగుతోంది. డీలర్లు బియ్యం ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో కార్డులకు అనుగుణంగా దుకాణాల సంఖ్య పెరిగితే తమ ఇబ్బందులు దూరం కావడంతోపాటు సమయం సైతం ఆదా అవుతుందని లబ్ధిదారులు అంటున్నారు. అధికారులు దుకాణాల సంఖ్యను పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో కొత్త కార్డులు 80,538
నిజామాబాద్ జిల్లాకు 45,240..
కామారెడ్డి జిల్లాకు 35,298
కార్డుల మంజూరుకు అనుగుణంగా పెరగని దుకాణాల సంఖ్య


