భూభారతి దరఖాస్తులను పరిష్కరించాలి
● మండలాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి
● అధికారులకు కలెక్టర్
సంగ్వాన్ ఆదేశాలు
కామారెడ్డి క్రైం: వారం రోజుల్లోగా భూభారతి దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో మహమ్మద్నగర్, బిచ్కుంద, గాంధారి, లింగంపేట మండలాల తహసీల్దార్లతో సమావేశమై భూభారతి పెండింగ్ దరఖాస్తుల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించం కోసమే ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకు రావడం, రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించడం జరిగిందన్నారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కరించడం ద్వారా రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. వెంటనే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఆయా మండలాల్లో పెండింగ్లో దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని సూచించారు. దరఖాస్తుల పరిష్కారం త్వరగా జరిగేలా ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, సంబంధిత ఆర్డీవోలను ఆదేశించారు. సమావేశంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, కలెక్టరేట్ ఏవో మసూర్ అహ్మద్, సూపరింటెండెంట్ రషీద్ తదితరులు పాల్గొన్నారు.


