
‘అంకిత భావంతో పాఠాలు బోధించాలి’
గాంధారి : ఉపాధ్యాయులు అంకిత భావంతో విద్యార్థులకు పాఠాలు బోధించాలని డీఈవో రాజు సూచించారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని బాలికల ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్య పుస్తకాలు అందించారు. కార్యక్రమంలో ఎంఈవో శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
రేపు ప్రణవానంద దాస్ స్వామీజీ రాక
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగే పలు కార్యాక్రమాలలో పాల్గొనేందుకు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్) ప్రతినిధి ప్రణవానంద దాస్ రానున్నారని పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు భూమేశ్ గుప్తా తెలిపారు. శుక్రవారం కన్యకాపరమేశ్వరి ఫంక్షన్ హాల్లో విలేకరులతో మాట్లాడారు. స్వామీజీ రాక సందర్భంగా ఆదివారం సాయంత్రం పట్టణంలోని హౌసింగ్ బోర్డు శారదామాత ఆలయం నుంచి ధర్మశాల వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అనంతరం కన్యకా పరమేశ్వరి ఆలయంలో స్వామివారి ప్రవచన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో ఇస్కాన్ కామారెడ్డి ఇన్చార్జి వెంకటరాస్, కన్వీనర్ సిద్దిరాములు, ప్రతినిధులు శ్రీహరి, నందగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
సర్టిఫికెట్ల జారీలో జాప్యంతో ఇబ్బందులు
నాగిరెడ్డిపేట: అధికారులు రెవెన్యూ సదస్సులలో బిజీగా ఉండడంతో సకాలంలో సర్టిఫికెట్లు జారీ కాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గత పది రోజులుగా భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. అధికారులు ఆయా సదస్సులతో ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీగా ఉంటున్నారు. దీంతో మిగతా కార్యకలాపాలపై ప్రభావం పడుతోంది. ప్రధానంగా విద్యాసంవత్సరం ప్రారంభం నేపథ్యంలో విద్యార్థులకు వివిధ రకాల సర్టిఫికెట్లు అవసరం అవుతాయి. కులం, ఆదాయం, లోకల్ సర్టిఫికెట్లకోసం వారు తహసీల్ ఆఫీస్కు వస్తున్నారు. కానీ అధికారులు అందుబాటులో లేకపోవడంతో వారి పనులు ముందుకు సాగడం లేదు. ఈ అంశాన్ని ‘సాక్షి’ నాగిరెడ్డిపేట తహసీల్దార్ శ్రీనివాస్రావు దృష్టికి తీసుకువెళ్లగా సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమేనన్నారు. సోమవారం నుంచి సర్టిఫికెట్ల జారీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని పేర్కొన్నారు.

‘అంకిత భావంతో పాఠాలు బోధించాలి’