
ఉపాధి ప్రణాళిక ఖరారు
కామారెడ్డి రూరల్: గ్రామాల్లో వలసలను నివారించి కూలీలకు పని కల్పించేందుకు జాతీయ ఉపాధి హామీ పథకం కింద 2025–26 ఆర్ధిక సంవత్సరానికి పనిదినాలను అధికారులు ఖరారు చేశారు. గతేడాది అక్టోబరు నుంచి డిసెంబరు వరకు గ్రామాల్లో ఉపాధి పనుల గుర్తింపు కోసం అధికారులు గ్రామసభలను నిర్వహించారు.
2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31వరకు స్థానికంగానే కూలీలకు పనులు కల్పించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
మండలంలోని 14 గ్రామ పంచాయతీల పరిధిలో..
కామారెడ్డి మండలంలోని 14 గ్రామపంచాయతీల పరిధిలో 2025–26 ఆర్థికసంవత్సరంలో మొత్తం 2,20,200 పనిదినాలను కల్పించాలని డీఆర్డీవో అధికారులు నిర్ణయించారు. మొత్తం 6,538 జాబ్ కార్డులున్నాయి. కార్మిక బడ్జెట్ రూ. 12.43 కోట్లు, మెటిరియల్ బడ్జెట్ రూ. 2 కోట్ల 69 లక్షల 78 వేలు మంజూర య్యాయి. గతానికి భిన్నంగా గ్రామం యూనిట్ గా పనులు చేపట్టాలని రెండేళ్లక్రితం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పనుల గుర్తింపు, కూలీల వేతనాలను చెల్లించేందుకు కొత్త సాప్ట్వేర్ను ఎన్ఐసీని (నేషనల్ ఇన్ఫార్మాటెక్ సెంటర్)వినియోగిస్తున్నారు. ఈ విధానం ద్వారా ఉపాధి పనులకు హాజరైన కూలీలకు ఆధార్కార్డు నంబర్తో లింక్ ఉన్న బ్యాంకు ఖాతాలో వేతనాలను జమ చేస్తున్నారు.
చేపట్టనున్న పనులు...
కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం ఈ ఏడాది గ్రామాలకు ఉపయోగపడే పనులను గుర్తించారు. ప్రధానంగా చెరువులు, కుంటలు, పంట కాలువల్లో పూడికతీత, నీటికుంటల నిర్మాణం, ఇంకుడుగుంతలు, వనమహోత్సవానికి గుంతల తవ్వకం, పంటపాలాలకు కొత్త దారుల నిర్మాణం తదితర పనులు చేపట్టనున్నారు. ప్రతి గ్రామంలో వందమందికి తగ్గకుండా ఉపాధి పనులు కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టారు.
2025–26 ఏడాదిలో
2.20 లక్షల పనిదినాలు
వ్యవసాయ పనులకు ప్రాధాన్యత
కామారెడ్డి మండలంలో
6,538 జాబ్ కార్డులు