
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
బిచ్కుంద(జుక్కల్): మండలంలోని హజ్గుల్ సమీపంలోగల మంజీరా నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 10 ట్రాక్టర్లను కందర్పల్లి వద్ద ఆదివారం పొలీసులు పట్టుకున్నారు. వేబిల్లు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారం మేరకు తనిఖీలు చేపట్టి పట్టుకున్నట్లు ఎస్సై మోహన్రెడ్డి తెలిపారు.
ఖాళీ బిందెలతో మహిళల నిరసన
రుద్రూర్: మండల కేంద్రంలోని రాంమందిర్ కాలనీలో ఆదివారం నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. గత 15 రోజులుగా పంచాయతీ కుళాయిలు రావడం లేదన్నారు. నీటి కోసం సమీప కాలనీల్లోకి వెళ్తే ఘర్షణ పడుతున్నారని వాపోయారు. మండుటెండలో నీటి కోసం తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై జీపీలో విన్నవిస్తే స్పందన కరువైందన్నారు. ఇకనైనా జీపీ అధికారులు సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు.