● బాణసంచా ప్రమాదంలో
26కి చేరిన మృతులు
● చికిత్స పొందుతూ ముగ్గురి మృతి
● మరో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరం
సామర్లకోట: వేట్లపాలెం బాణసంచా ప్రమాదంలో రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఘటనా ప్రదేశంలో 20 మంది సజీవ దహనం అయిన విషయం విదితమే. మంగళవారం నాటికి మృతుల సంఖ్య 23 కాగా, బుధవారం ముగ్గురు మృతి చెందారు. సామర్లకోట, కుమ్మర వీధికి చెందిన పల్లపాటి వీరశ్రీనివాసు(45), కాతేటి శ్రీను (35) వేట్లపాలెంకు చెందిన చిటికెల లక్ష్మి(45)తో ముగ్గురు మృతి చెందారు. దాంతో మృతుల సంఖ్య 26కు చేరింది. కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న తొమ్మిది మందిలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందగా, మరో మగ్గురు పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలిసింది.
పల్లపాటి వీర శ్రీనివాసుకు భార్య రోజా మాత్రమే ఉంది. పిల్లలు లేరు. కాతేటి శ్రీనుకు భార్య కాతేటి రోజా, ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు. చిటికెల లక్ష్మి భర్త గతంలోనే మరణించడంతో బంధువులతో ఉంటోంది. పోషణ నిమిత్తం తెలిసిన విద్య అయిన బాణసంచా తయారీ పనికి వెళుతోంది. లక్ష్మి మృతితో వేట్లపాలెంలో మృతుల సంఖ్య 16కు చేరింది. సామర్లకోట కుమ్మర వీధికి చెందిన ఏడుగురు ఇప్పటి వరకు మృతి చెందారు. జి. మేడపాడుకు చెందిన ఇద్దరు, పీబీ దేవంకు చెందిన ఒకరితో కలిపి మొత్తం 26 మంది బాణా సంచా ప్రమాదంలో మృతి చెందారు.కుమ్మరవీధికి చెందిన పల్లపాటి వీర శ్రీనివాసు మృతి చెందిన వార్త తెలిసిన వెంటనే భార్య గుండెలు బాదుకొంటూ రోధిస్తూ నన్ను కాకినాడ తీసుకు వెళ్డండి అంటూ అటు ఇటూ పరుగులు తీయడంతో స్థానికులు చలించి పోయారు. పిల్లలు లేక పోవడంలో పోస్టుమార్టమ్ వద్దకు భౠర్య రోజా వెళ్లవలసి ఉండటంతో ఆ ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళలు ఆమెను కాకినాడ తీసుకువెళ్లారు. కాగ కాతేటి శ్రీనుకు భార్య రోజా ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. శ్రీను మరణ వార్త తెలిసి కుటుంబ సభ్యులు కాకినాడ పరుగులు తీశారు.
నాకు అండ లేకుండా పోయింది
పెళ్లి అయినా మాకు పిల్లలు లేరు. దాంతో ఒకరికి ఒకరు తోడుగా జీవిస్తున్నాం. నా భర్త మృతితో నాకు తోడు లేకుండా పోయింది. నా భర్త నన్ను ఎంతో ప్రేమగా చూసుకొనేవారు. అత్త, మామలు ఉన్నా వారు ఎంత కాలం చూస్తారు. ఒంటరి జీవితం నరక యాతనగా ఉంటుంది.
– రోజా, పల్లపాటి వీర శ్రీనివాసు భార్య


