
కూటమిలో తుని తగవు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: అక్రమ సంపాదనలో పంపకాలు తెగక కూటమి నేతలు రోడ్డెక్కుతున్నారు. గద్దెనెక్కిన ఏడాది కాలంగా మట్టి, ఇసుక, మైనింగ్ మాఫియాతో చేతులు కలిపి రూ.లక్షలు వెనకేసుకుంటున్నారు. ఎక్కడికక్కడ నీకు సగం, నాకు సగం అంటూ వాటాలు వేసుకుంటూ, వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య వాటాలు, పంపకాలు తెగక వివాదాలతో రోడ్డెక్కుతున్నారు. పిఠాపురంలో బొండు ఇసుక దందా కోసం జనసేన, టీడీపీ నేతల మధ్య రగిలిన దుమారం చల్లారక ముందే.. తాజాగా తునిలో మట్టి అక్రమ తవ్వకాల చిచ్చు రేగింది.
మాజీ మంత్రి, హోం మంత్రి వర్గాల పోరు
టీడీపీలో నంబర్–2గా చెప్పుకొనే మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన కుమార్తె, తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యనమల దివ్య ఒకవైపు.. హోం మంత్రి వంగలపూడి అనిత వర్గీయులు మరోవైపు మట్టిలో కాసుల కోసం కొట్టుకుంటున్నారు. మంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం తుని సరిహద్దునే ఉంది. అక్కడి వనిత అనుచరులైన టీడీపీ నేతల మట్టి తరలింపును తుని వైపు యనమల అనుచరులతో పాటు జనసేన నేతలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తమ నియోజకవర్గంలో మట్టి తవ్వుకుంటూంటే అందులో వాటాలెందుకివ్వాలని పాయకరావుపేట టీడీపీ నేతలు.. మట్టి తమ ప్రాంతానికి తరలిస్తున్నందు తమకు పంపకాలు జరగాల్సిందేనని తుని వైపు కూటమి నేతలు సిగపట్లు పడుతున్నారు. ఈ క్రమంలో వివాదం ముదురుపాకాన పడింది. ఈ నేపథ్యంలో పాయకరావుపేట వైపు నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న లారీలు, ట్రాక్టర్లు, జేసీబీని తుని వైపు వైరి వర్గం పట్టుకుని, తుని రూరల్ పోలీసులకు అప్పగించింది. దీనిపై ఇరువర్గాలూ గురువారం పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.
కొల్లగొడుతున్నారిలా..
పాయకరావుపేట మండలంతో పాటు తుని మండలం ఎస్.అన్నవరం శివారు కవలపాడులో కాకినాడ జగన్నాథపురం ఎంఎస్ఎన్ చారిటీస్కు చెందిన భూములున్నాయి. ఈ భూముల్లో కొంత మంది ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారు. ఇటుకల తయారీకి ప్రధాన ముడి సరకు చెరువు గర్భాల్లోని మట్టి. కవలపాడులో చాలా ఏళ్లుగా ఇటుకల బట్టీలు నడుస్తున్నా ఎప్పుడూ ఇటువంటి వివాదాలు లేవని అంటున్నారు. ఇటుక బట్టీలకు అవసరమైన చెరువు మట్టిని టిప్పర్కు రూ.10 వేలు, ట్రాక్టర్కు రూ.1,200కు అమ్మి కూటమి నేతలు జేబులు నింపుకొంటున్నారు. ప్రతి రోజూ 150 నుంచి 200 ట్రిప్పుల మట్టి రాత్రి, పగలు అనే తేడా లేకుండా అక్రమంగా తరలించుకుపోతున్నారు. రాత్రి వేళల్లో ఇష్టారాజ్యంగా మట్టి దోపిడీకి పాల్పడుతున్నారు. రెవెన్యూ, మైనింగ్ శాఖల నుంచి అనుమతి లేనప్పటికీ అధికారం చేతిలో ఉందనే బరితెగింపుతో మట్టి తవ్వి తరలించేస్తున్నారు. అదేమని అడిగి నాథుడే లేకుండా పోయాడు. మట్టి అక్రమాల్లో కూటమి పెద్దలున్నారనే ఉద్దేశంతో తమకెందుకనే ధోరణిలో ఆయా శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.
వాటాల కోసం ‘పంచాయితీ’
పాయకరావుపేట మండలం నుంచి మట్టిని తుని మండలం కవలపాడులోని ఇటుక బట్టీలకు తరలిస్తూ పాయకరావుపేట కూటమి నాయకులు రూ.లక్షలు వెనకేసుకుంటున్నారు. ఈ దందాలో తమకు వాటా లేక అన్యాయమైపోతున్నామని తుని మండలం ఎస్.అన్నవరంలోని టీడీపీ జనసేన నేతలు భావించారు. ఈ నేపథ్యంలో పాయకరావుపేట నుంచి జరుగుతున్న మట్టి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. అక్రమార్జనలో తమకూ వాటా ఇవ్వాలని కొన్ని రోజులుగా తుని టీడీపీ పెద్దల వద్ద పంచాయితీ నడుస్తోంది. పాయకరావుపేటలో బీజీపీకి చెందిన ఒక కీలక నేత, బంగారయ్యపేటకు చెందిన టీడీపీ ద్వితీయ శ్రేణి నేత, తుని మండలం ఎన్.సూరవరం గ్రామ టీడీపీ నేతలు మట్టిలో అక్రమార్జన కోసం కుస్తీ పడుతున్నారు. అయినప్పటికీ పాయకరావుపేట నేతలు దారికి రావడం లేదు. దీంతో, తుని టీడీపీ, జనసేన నేతలు గురువారం తెల్లవారుజామున రంగంలోకి దిగారు. కవలపాడు మట్టి లోడుతో వచ్చిన మూడు లారీలను, మూడు ట్రాక్టర్లను, ఒక జేసీబీని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో, ఈ వివాదం మరింత రచ్చకెక్కింది. మట్టి తవ్వకాల్లో వాటాల కోసం ఇంత నిస్సిగ్గుగా రోడ్డెక్కుతున్న కూటమి నేతలను చూసి స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.
కుదిరిన సంధి!
వాటాల కోసం రోడ్డెక్కిన నేతల మధ్య కూటమి పెద్దలు సంధి కుదిర్చారని అంటున్నారు. పర్సంటేజీలపై ఒప్పందాలు కుదిర్చి, వివాదాన్ని సర్దుబాటు చేశారని చెబుతున్నారు. పోలీసులకు అప్పగించిన వాహనాలను గంటల వ్యవధిలోనే వదిలేయడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. అక్రమాలను బయటపెట్టి, వాహనాలను పట్టించిన కూటమి నేతలే.. వాటాలు కుదిరేసరికి వెనక్కు తగ్గడం చూసి జనం విస్తుపోతున్నారు. పంపకాల చిచ్చు ప్రస్తుతానికి చల్లారినా.. భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.

కూటమిలో తుని తగవు