
టెన్త్ సప్లిమెంటరీలో 86.51 శాతం ఉత్తీర్ణత
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాల్లో జిల్లా 86.51 శాతం ఉత్తీర్ణత సాధించిందని జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) పిల్లి రమేష్ గురువారం తెలిపారు. పరీక్షలకు 5,248 మంది హాజరు కాగా 4,540 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. వీరిలో బాలురు 2,686, బాలికలు 1,853 మంది ఉన్నారని పేర్కొన్నారు. రీ కౌంటింగ్ లేదా రీ వెరిఫికేషన్కు ఈ నెల 19వ తేదీ రాత్రి 11 గంటల్లోగా సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.
ఓపెన్ స్కూల్లో 90.93 శాతం ఉత్తీర్ణత
ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ ఫలితాలు కూడా విడుదలయ్యాయి. పదో తరగతి పరీక్షలకు 441 మంది హాజరవగా 401 మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే ఇంటర్లో 1,131 మందికి గాను 985 మంది ఉత్తీర్ణులయ్యారని డీఈఓ రమేష్ తెలిపారు.
జిల్లా దేవదాయ అధికారి
బాధ్యతల స్వీకరణ
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా దేవదాయ శాఖ అధికారిగా కనపర్తి నాగేశ్వరరావు గురువారం బా ధ్యతలు స్వీకరించారు. తూర్పు గోదావరి జిల్లా దేవదాయ శాఖాధికారిగా పని చేస్తున్న ఆయన బదిలీపై కాకినాడ జిల్లాకు వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనను దేవదాయ శాఖ ఉప కమిషనర్ కార్యాలయ సూపరింటెండెంట్ సోమరాజు, నగరంలోని పలు దేవాలయాల ఈఓలు అ భినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేవదాయ శాఖ ఈఓలు, అర్చకుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని చెప్పారు. ఆలయాలకు వచ్చే భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తామన్నారు.
వర్షాల హెచ్చరికలతో
ఈపీడీసీఎల్ అప్రమత్తం
విశాఖ సిటీ: భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ఈపీడీసీఎల్ అప్రమత్తమైంది. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి అధికారులను అప్రమత్తం చేశారు. ఆయన ఆదేశాల మేరకు వినియోగదారులకు 24/7 సేవలందించేందుకు కార్పొరేట్ కార్యాలయంతో పాటు సంస్థ పరిధిలోని 11 జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు లేకుండా చూసేందుకు అవసరమైన యంత్రాంగాన్ని, పరికరాలను, సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని ఎస్ఈలు, ఈఈలను సీఎండీ ఆదేశించారు. అధికారులందరూ వినియోగదారులకు అందుబాటులో ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప సిబ్బందికి ఎటువంటి సెలవులూ మంజూరు చేయవద్దని సూచించారు. విద్యుత్ అంతరాయాలకు సంబంధించిన సమాచారాన్ని వినియోగదారులు కంట్రోల్ రూమ్ నంబర్లకు తెలియజేసి, సత్వర పరిష్కారం పొందవచ్చని సూచించారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో
కంట్రోల్ రూము నంబర్లు
రాజమహేంద్రవరం: 73822 99960
కాకినాడ: 94931 78718
కోనసీమ: 94409 04477
కార్పొరేట్ ఆఫీస్: 1912