
సీతారాములకు వెండి మకర తోరణం
అన్నవరం: సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారి నిత్య కల్యాణంలో పెళ్లి పెద్దలుగా వ్యవహరించే సీతారాములకు అన్నవరం దేవస్థానం వ్రత పురోహితులు వెండి మకర తోరణం సమర్పించారు. వ్రత పురోహిత సూపర్వైజర్లు అల్లంరాజు సత్య శ్రీనివాస్, గుత్తిన రామకృష్ణ, వ్రత పురోహిత సంఘం మాజీ అధ్యక్షుడు రవిశర్మ, వారి డ్యూటీ సభ్యులు 43 మంది రూ.3 లక్షల విలువైన 345 గ్రాముల వెండితో దీనిని తయారు చేయించారు. మకర తోరణాన్ని గురువారం ఈఓ వీర్ల సుబ్బారావుకు అందజేశారు. దీనిని ప్రతి రోజూ స్వామివారి కల్యాణంలో సీతారాములకు అలంకరించాలని కోరారు.
సాక్షి కథనంతో..
గతంలో పెళ్లి పెద్దలు సీతారాములను వేరే ఆసనంపై కాకుండా సత్యనారాయణ స్వామి, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారి పాదాల చెంతన ఉంచి సత్యదేవుని కల్యాణం నిర్వహించేవారు. దీనివలన కల్యాణంలో స్వామి, అమ్మవారిపై వేసిన తలంబ్రాలు సీతారాములపై కూడా పడేవి. దీనిపై ‘సత్యదేవుని నిత్య కల్యాణంలో అపచారం’ శీర్షికన గత ఏడాది జూన్ 24న ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై అప్పటి ఈఓ, ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ వెంటనే స్పందించారు. సత్యదేవుడు, అమ్మవారి సింహాసనం పక్కనే సీతారాములను మరో ఆసనంపై వేంచేయించి, కల్యాణం నిర్వహించాలని ఆదేశించారు. అప్పటి నుంచీ అదే విధంగా చేస్తున్నారు. అయితే సత్యదేవుడు, అమ్మవారి వెనుకన ఉన్నట్టుగా సీతారాముల మూర్తులకు మకర తోరణం లేకపోవడంతో బోసిపోయినట్లు ఉండేది. ఈ నేపథ్యంలో వ్రత పురోహితులు ఈ వెండి మకర తోరణం సమర్పించారు.