
సబ్ ప్లాన్ టెండర్లు ఎస్సీలకే కేటాయించాలి
మలికిపురం: రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ సబ్ప్లాన్ నిధులతో చేసే అభివృద్ధి పనులు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లకు అవసరమయ్యే సరకుల సరఫరా టెండర్లు దళితులకే కేటాయించాలని విస్తృత దళిత సంఘాల (విదసం), ఐక్య వేదిక రాష్ట్ర సమితి సమావేశం డిమాండ్ చేసింది. బుధవారం విదసం ఐక్యవేదిక రాష్ట్ర సమితి, రాజోలు పరిరక్షణ సమితి సంయుక్త సమావేశం మలికిపురం మండలం శంకరగుప్తంలో సభ్యులు చింతా సత్య ఇంటి వద్ద జరిగింది. విదసం కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు మాట్లాడుతూ ఎస్సీ సబ్ ప్లాన్ సక్రమ అమలు కోసం ప్రభుత్వం ఎస్టీఎస్ (సబ్ ప్లాన్ టెండర్లు ఎస్సీలకే) అనే కొత్త స్కీమ్ ప్రవేశ పెట్టాలని సలహా ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న 750 సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, 50 రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉన్న లక్షా నాలుగు వేల మంది విద్యార్థులకు సరకుల సరఫరా కోసం కాంట్రాక్టర్లకు ప్రభుత్వం ఏటా రూ.150 కోట్లు చెల్లిస్తోందని, ఈ సరఫరా దారుల్లో ఒక్క టెండర్లో కూడా దళితుడు లేడన్నారు. రాష్ట్రంలో దళిత వాడల్లో 12 వేల అంగన్వాడీ కేంద్రాల్లో సరకులు సరఫరా టెండర్లు దళితులకు ఇస్తే 1,000 నుంచి 1,500 కుటుంబాలకు జీవనోపాధి కల్పించవచ్చన్నారు. రాజోలు పరిరక్షణ చైతన్య సమితి చింతా సత్య మాట్లాడుతూ జాతీయ స్థాయిలో కులగణన పూర్తయ్యే వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. కొంకి రాజమణి , ముత్యాల శ్రీనివాస్, జాజి ఓంకార్, గుడివాడ ప్రసాద్, ఉప్పాడ రాము పాల్గొన్నారు.
విదసం, రాజోలు ప్రదర్శన
చైతన్య సమితి డిమాండ్