జగిత్యాలటౌన్: మహిళలు అన్నిరంగాల్లో రాణించాలంటూ వేదికలపై ప్రకటనలు చేస్తున్న నాయకులు జగిత్యాల నియోజకవర్గంలో మాత్రం రాజకీయంగా అణగదొక్కేందుకు కుట్రలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి ఆరోపించారు. ఆదివారం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధికి సహకరించడం లేదన్న ఎమ్మెల్యే మాటలు సత్యదూరమన్నారు. నగర్వాన్ యోజన కింద జగిత్యాల నియోజకవర్గానికి రూ.2కోట్లు మంజూరయ్యాయన్నారు. మొదటి విడతలో రూ.1.4కోట్లు విడుదలవగా దానికి సంబందించిన ఖర్చుల వివరాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించకపోవడంతోనే మిగతా నిధులు విడుదల కాలేదన్నారు. నియోజకవర్గానికి ఎంపీ అరవింద్ మంజూరు చేయించిన రూ.60కోట్ల నిధులు ఎక్కడికి పోయాయో తెలియడం లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉందని, ప్రజల ఆశీశిర్వాదంతో తాను నిలబడి కలబడతానని పేర్కొన్నారు. కౌన్సిలర్లు వేముల శ్రీనివాస్, నిమ్మల నాగరాజు, గట్టిపెల్లి మానస, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముద రాజు, సిరికొండ రాజన్న, ఇట్యాల రాము, పవన్సింగ్, కడార్ల లావణ్య, సింగం పద్మ, మామిడాల కవిత ఉన్నారు.


