
భూ సమస్యల పరిష్కారానికే సదస్సులు
జగిత్యాలరూరల్/మల్యాల: భూ సమస్యల పరిష్కారానికి గ్రామస్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ అన్నారు. శుక్రవారం జగిత్యాల రూరల్ మండలం తక్కళ్లపల్లి, ధర్మారం, మల్యాల మండలం రామన్నపేట గ్రామాల్లో జరిగిన సదస్సుల్లో పాల్గొని మాట్లాడారు. భూ సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో దరఖాస్తులు అప్లోడ్ చేయాలని అధికారులకు సూచించారు. కాగా మల్యాల మండలం రామన్నపేట, నూకపల్లి గ్రామాల మధ్య సర్వే నంబర్ల వివాదం చెలరేగుతోందని, రామన్నపేట పరిధిలోని సర్వే నంబర్ల గెజిట్ పత్రం తమకు అందజేయాలని కోరుతూ వెల్మ లక్ష్మారెడ్డి తదితరులు ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ శ్రీనివాస్, డీటీలు అరుణ్కుమార్, నీత, ఆర్ఐలు భూమయ్య, శంషోద్దీన్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.