
రాజీకొస్తేనే మనశ్శాంతి
జగిత్యాలజోన్: జిల్లాలోని వివిధ కోర్టుల్లో ఉన్న కేసులను ఈనెల 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని, తద్వారా కక్షిదారులు మనశ్శాంతి పొందాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి అన్నారు. జిల్లా కోర్టులో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో రాజీకి వీలున్న సివిల్, క్రిమినల్ కేసుల్లోని 3,559 కక్షిదారులకు నోటీసులు పంపించామన్నారు. అన్ని కోర్టులో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించేందుకు పోలీసులు, న్యాయవాదులతో చర్చించామని తెలిపారు. వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో 845 క్రిమినల్ కేసులు రాజీకి అనుకూలంగా ఉన్నాయన్నారు. మోటార్ వాహనాలు, డ్రంకెన్డ్రైవ్, పిటీ కేసులతోపాటు కోర్టు వరకూ రాని ఫ్రీలిటిగేషన్ కేసులు పరిష్కరిస్తామని వివరించారు. ప్రతి కోర్టులో లోక్ అదాలత్ బెంచ్ ఏర్పాటు చేస్తున్నామని, లోక్ అదాలత్నాడే కాకుండా.. ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరిస్తామని వెల్లడించారు. లోక్ అదాలత్లో కేసు పరిష్కరించుకుంటే కోర్టు ఫీజు వాపస్ ఇస్తారని, తీర్పులపై అప్పీల్కు వెళ్లే అవకాశం ఉండదన్నారు. లోక్ అదాలత్కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే జిల్లా కోర్టులోని న్యాయ సేవాసంస్థ కార్యదర్శిని సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో సబ్ జడ్జి, జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి మల్లిక్ వెంకట సుబ్రహ్మాణ్యశర్మ పాల్గొన్నారు.