
మూడేళ్ల అనంతరం తెరుచుకున్న పాఠశాలలు
జగిత్యాల: ఆ పాఠశాలలో మూడేళ్లుగా ఒక్క విద్యార్థి కూడా లేడు. దీంతోపాటు పలు కారణాలతో బడులను మూసివేశారు. జిల్లాలో మూతపడిన పాఠశాలలు 61 వరకు ఉన్నాయి. ఇందులో మూడేళ్లుగా చేరికలే లేవు. ఈ ఏడాది నిర్వహించిన బడిబాటలో భాగంగా ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు వెల్గటూర్ మండలం వెంకట్రావ్పేట, కుమ్మరిపల్లి ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు చేరడంతో ఆ పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. మూడేళ్ల తర్వాత పాఠశాలలు తెరుచుకోవడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధ్యాయుల కృషి ఫలితమే
పాఠశాల ఉపాధ్యాయుల కృషి ఫలితంగానే మళ్లీ తెరుచుకున్నాయని డీఈవో రాము తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో వసతులతోపాటు నాణ్యమైన విద్య అందుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలలోనే చదివేలా చూడాలని, కార్పొరేట్ స్థాయిలో విద్య అందుతుందని చెప్పారు.