
ఇంటర్ విద్యలో విప్లవాత్మక మార్పులు
జగిత్యాల: ఇంటర్ విద్యలో విప్లవాత్మక మార్పులు తెచ్చినట్లు ఇంటర్ బోర్డు పరిశీలకులు వెంకటేశ్వర్రావు అన్నారు. జిల్లాకేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాలలో అడ్మిషన్ ప్రక్రియను ప్రారంభించి పోస్టర్ ఆవిష్కరించారు. కళాశాలల్లో లెక్చరర్లు అడ్మిషన్ల లక్ష్యం పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, ఇంటర్ బోర్డు కమాండ్ సెంటర్ నుంచి ప్రతి అధ్యాపకుడి బోధన తీరును పరిశీలిస్తామని వెల్లడించారు. అధ్యాపకులు 90రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని ఆ మేరకు బోధించాలని పేర్కొన్నారు. కళాశాలలో యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, క్రీడల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులకు ఎఫ్ఆర్సీ అమలు చేస్తామన్నారు. కేర్ టేకర్ విధానాన్ని అమలు చేయడం ద్వారా ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తామన్నారు. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ నోడల్ అధికారి నారాయణ, ప్రిన్సిపల్ అలియా మక్సూద్, కె.నాగభూషణం, జూనియర్ లెక్చరర్ల సంఘం 475 అధ్యక్షుడు కె.తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు.