
ఆపిల్ బేర్ సాగు.. లాభాలు బాగు
● ప్రత్యామ్నాయ పంటల వైపు అన్నదాతల చూపు ● తోటి రైతులకు ఆదర్శం..
సారంగాపూర్: జిల్లా వ్యవసాయ ఆధారితం. సాగునీటి సౌకర్యం ఉండడంతో ఇక్కడి రైతులు ఎక్కువగా వరి పండిస్తుంటారు. తర్వాతి స్థానంలో మొక్కజొన్న, పత్తి వంటివి ఉన్నాయి. కొన్నాళ్లుగా రైతులు పంట మార్పిడి వైపు దృష్టి సారిస్తున్నారు. తమకున్న పొలంలో కొద్దిపాటి విస్తీర్ణంలో గంగనేరడి (ఆపిల్బేర్) పళ్ల సాగు చేపడుతున్నారు. ఈ పంట ను ఐదు, పది గుంటల్లో సాగుచేసినా ఊహించని లాభాలు వస్తుండడంతో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు. కాశ్మీర్ ఆపిల్గా పిలిచే ఈ గంగనేరడి పండులో అధిక పోషకాలు ఉంటాయంటున్నారు వ్యవసాయ అధికారులు. ఎక్కువ కేలరీలు ఉన్నా.. ఫ్యాట్ అతితక్కువగా ఉండి కార్బొహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్లు, పోటాషియం, మెగ్నీషియం, కాల్షియం, భాస్వరం, విటమిన్ కే వంటివి పుష్కలంగా ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు.
20 ఎకరాల్లో సాగు
సారంగాపూర్ మండలంలో ఇప్పటికే 20 ఎకరాల్లో ఆపిల్బేర్ సాగుచేస్తున్నారు. మరింత మంది రైతులు సాగు చేయడానికి ముందుకొస్తున్నారు. ముఖ్యంగా లక్ష్మీదేవిపల్లిలో ఎక్కువ మంది సాగు చేస్తున్నారు. దీనికి ఉపాధి హామీ కింద ప్రోత్సాహం అందుతుండడంతో రైతులు ముందుకొస్తున్నారు. మొక్క ఖరీదు, గుంత తీయడం, నాటడం, మూడేళ్ల వరకు నిర్వహణ ఖర్చులు రైతులకు అందుతున్నాయి. మొక్కలను ఖమ్మం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూర్ నుంచి తెప్పిస్తున్నారు. ఎనిమిది నెలల్లో మొదటి పంట చేతికి వస్తుంది. మొదటి ఏడాది 5 నుంచి 10 కిలోలు దిగుబడి ఇస్తుందని, మూడో సంవత్సరం వరకు 50 కిలోల నుంచి 70 కిలోల పంట చేతికొస్తుందని రైతులు అంటున్నారు. మూడో ఏడాది నుంచి ఎకరాకు రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు ఆదాయం వస్తుందంటున్నారు.
ఫ్రూనింగ్ తప్పనిసరి
ఆపిల్బేర్ పంట కాలం ముగిసిన వెంటనే మే, జూన్లో కొమ్మలను కత్తిరించాలని, తద్వారా కొత్తగా ఆకులు, కొమ్మలు వచ్చి దిగుబడి ఎక్కువగా వస్తుందని రైతులు చెబుతున్నారు.