
మక్క విత్తనాల సబ్సిడీకి మంగళం
● ఓపెన్ మార్కెట్లోనే హైబ్రిడ్ విత్తనాల కొనుగోలు ● కంపెనీలను బట్టి 4 కిలోల బస్తాకు రూ.1500 నుంచి రూ.2500 వరకు ● సబ్సిడీ లేక జిల్లా రైతులకు రూ.4కోట్ల మేర నష్టం
జగిత్యాలఅగ్రికల్చర్: వానాకాలం సీజన్లో జిల్లాలో అత్యధికంగా సాగు చేసే మొక్కజొన్న విత్తనాలకు ప్రభుత్వం మంగళం పాడింది. వరి విత్తనాల మా దిరిగా రైతులు తమ పంట నుండి వచ్చే మొక్కజొ న్న విత్తనాలు వాడుకుంటే దిగుబడులు రావు. దీంతో మక్క సాగు చేసే రైతులు ప్రైవేట్ కంపెనీల హై బ్రిడ్ విత్తనాలపైనే ఆధారపడుతున్నారు. దీంతో ఆ యా కంపెనీలు చెప్పిన ధరకు రైతులు ఓపెన్ మా ర్కెట్లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. పంటలోమూడు నెలల తర్వాత వచ్చే దిగుబడి ఏ మోగాని, విత్తనాల ఖర్చే తడిసి మోపెడవుతోంది. మొక్కజొన్నలపై కనీసం 33శాతం సబ్సిడీ లేక రైతులపై దాదాపురూ.4కోట్లఅదనపుభారంపడుతోంది.
వైఎస్సార్ హయాంలో 33 శాతం సబ్సిడీ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ప్రైవేట్ కంపెనీలు విత్తనాలపై 33 శాతం సబ్సిడీ ఇచ్చేది. దీంతో రైతులు తమకు నచ్చిన కంపెనీ విత్తనాలు కొనుగోలు చేసి సబ్సిడీ పొందేవారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో సబ్సిడీ రద్దు అయ్యింది. దీనివల్ల జిల్లా రైతులపై అధిక భారం పడనుంది. జిల్లా మొత్తంగా దాదాపు 60 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తారు. రైతులు ఎకరాకు 4 కిలోల విత్తనాలు వాడుతారు. దీన్ని బట్టి జిల్లాకు 2.40 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం.
4 కిలోల బస్తాకే రూ.1500 నుంచి రూ.2500
రైతుల డిమాండ్ను ఆసరా చేసుకుని.. ప్రైవేట్ కంపెనీలు తమ విత్తనాలకు వివిధ పేర్లు పెట్టి నచ్చిన ధరకు అమ్ముతున్నాయి. విత్తన ధరలపై ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో కంపెనీలు తమ ఉత్పత్తి ధర, లాభాలు చేసుకుంటూ అమ్మకాలు సాగిస్తున్నాయి. రైతులు క్వింటాల్ మొక్కజొన్నలను రూ.1800 నుంచి రూ.2000కు విక్రయిస్తే విత్తన కంపెనీలు మాత్రం కంపెనీ డిమాండ్ను బట్టి 4 కిలోల బస్తాను రూ.1500 నుంచి రూ.2500 వరకు విక్రయిస్తున్నాయి. కంపెనీలు గ్రామాల్లో ప్రచారం చేస్తూ.. తమ విత్తనాలను సాగు చేస్తే ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని, మొక్కజొన్న ఆకులు ఎక్కువగా రావడంతో రామచిలుకలు రావని, పంటకు తెగుళ్లు ఆశించవంటూ రైతులకు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నాయి.
సబ్సిడీ రాక..
మొక్కజొన్న విత్తనాలపై సబ్సిడీ లేకపోవడంతో జిల్లా రైతులకు రూ.4 కోట్ల వరకు నష్టం వాటిల్లుతోంది. సగటున మొక్కజొన్న 4 కిలోల విత్తనాల సంచిని రూ.2000 వరకు కంపెనీలు విక్రయిస్తే.. ఆ సంచిపై 33 శాతం సబ్సిడీ ఉంటే రూ.660 సబ్సిడీ రైతులకు దక్కేది. కేవలం రైతులు సంచికి రూ.1340 చెల్లిస్తే సరిపోయేది. సబ్సిడీ ఎత్తివేయడంతో జిల్లా రైతులపై దాదాపు రూ.4 కోట్ల వరకు అదనపు భారం పడుతుంది.