
పోషణతో కూడిన విద్య అందించడమే లక్ష్యం
ధర్మపురి: అంగన్వాడీ కేంద్రాల్లో పోషణతో కూడిన విద్య అందించడమే లక్ష్యమని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. అమ్మమాట – అంగన్వాడీబాటలో భాగంగా మండలంలోని దొంతా పూర్లో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూడు నుంచి ఆరేళ్ల పిల్లల నమోదు, ప్రీస్కూల్ హాజరు పెంచడం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఆట పాటలతో విద్యనందించనున్నట్లు వెల్లడించా రు. అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించి వసతులు కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఆర్డీవో మధుసూదన్, జిల్లా సంక్షేమాధికారి నరేశ్, సిడిపివో వాణిశ్రీ, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లున్నారు.
ఆరోగ్య తెలంగాణ లక్ష్యం
మేడిపల్లి: ఆరోగ్య తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. భీమారం మండలకేంద్రంలో రూ.1.43 కోట్లతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేశారు. 97 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, 27మందికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. మేడిపల్లి మండలం వల్లంపల్లిలో కాకతీయ కెనాల్పై రూ.2.50కోట్లతో నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించారు. భీమారం మండల ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతోందని, ప్రజల కోరిక మేరకు వారు సూచించిన ప్రదేశంలోనే ఆసుపత్రి నిర్మాణం చేపడతామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి నరేశ్రెడ్డి, చేపూరి నాగరాజు, బద్దం రాజేందర్ రెడ్డి, నీరటి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
భూవివాదంలో ఒకరి ఆత్మహత్యాయత్నం
మెట్పల్లిరూరల్: తాను కొనుగోలు చేసిన భూమిని ఇతరులకు విక్రయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మెట్పల్లి మండలం చౌలమద్దిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడి వివరాల ప్రకారం.. కోరుట్లకు చెందిన వనతడుపుల నాగేశ్వరవరప్రసాద్ కొన్నేళ్ల క్రితం చౌలమద్ది శివారులోగల భూమి కొన్నాడు. డబ్బులు చెల్లించినా.. ఆ భూమిని ఓ కుల సంఘం పెద్దమనుషులు తనకు కాకుండా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయించారు. తన డబ్బులు తనకు ఇవ్వాలని అడిగినా ఇవ్వకపోవడంతో విసుగు చెందిన నాగేశ్వరవరప్రసాద్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు అతడిని మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి వద్ద ఓ నోట్ లభ్యమైంది. మెట్పల్లి సీఐ అనిల్, ఎస్సై కిరణ్కుమార్ బాధితుడి నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు.

పోషణతో కూడిన విద్య అందించడమే లక్ష్యం