
పైసలున్నా.. పనుల్లో జాప్యం
మెట్పల్లి(కోరుట్ల): ప్రజలకు వైద్యం అందించే చోట మెరుగైన వసతులు కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం హెల్త్ సబ్ సెంటర్లకు సొంత భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం రెండేళ్ల క్రితం నిధులు సైతం మంజూరు చేసింది. అయితే, జిల్లాలో ఇప్పటి వరకు కొన్ని చోట్ల మాత్రమే భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. చాలా చోట్ల స్థలాల సమస్యతో పాటు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపకపోవడం వంటి కారణాల వల్ల పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదు.
95 భవనాలు.. రూ.19 కోట్లు..
● జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో కలుపుకొని మొత్తం 95 చోట్ల ఉన్న హెల్త్ సబ్సెంటర్లకు కేంద్ర ప్రభుత్వం ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్’ పేరుతో సొంత భవనాలు మంజూరు చేసింది.
● ఒక్కో సెంటర్ నిర్మాణానికి నేషనల్ హెల్త్ మిషన్, 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.20 లక్షల చొప్పున మొత్తం రూ.19 కోట్లు కేటాయించింది. పనుల పర్యవేక్షణ బాధ్యతను పంచాయతీరాజ్ శాఖకు అప్పగించింది.
● అయితే ఇందులో ఇప్పటి వరకు కేవలం 11చోట్ల మాత్రమే భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి.
● 23 చోట్ల వివిధ దశల్లో పనులు సాగుతుండగా, మిగతా 61 చోట్ల ఇంత వరకు అసలు పనులే ప్రారంభించకపోవడం గమనార్హం.
జాప్యానికి కారణాలు..
● నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడానికి కొన్ని చోట్ల స్థలాల సమస్య ఉంటే.. మరికొన్ని చోట్ల ముడి సరుకుల ధరలు పెరగడం వల్ల ప్రభుత్వం ఇచ్చే నిధులతో గిట్టుబాటు కాదనే ఉద్దేశంతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని తెలిసింది.
● మెట్పల్లి పట్టణానికి ఆరు మంజూరు కాగా, ఇప్పటి వరకు స్థలాల ఎంపిక జరగలేదు. ఇక్కడ ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా మారింది.
● స్థానిక వ్యవసాయ మార్కెట్, మండల పరిషత్లో రెండు నిర్మించడానికి ఆయా శాఖలు మొదట అంగీకరించాయి. కానీ, భవిష్యత్తులో తలెత్తే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆ తర్వాత స్థలాలు ఇవ్వొద్దని నిర్ణయం తీసుకున్నాయి.
● అలాగే మినీ స్టేడియం స్థలంలో ఒకటి నిర్మించాలని తలపెట్టగా, అక్కడ కూడా ఆటంకాలు ఎదురుకావడంతో విరమించుకున్నారు.
కాంట్రాక్టర్లకు నోటీసులు
● స్థలాలు ఉన్న చోట పనులు మొదలు పెట్టని కాంట్రాక్టర్లకు అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. వెంటనే పనులు ప్రారంభించాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించినట్లు సమాచారం. జిల్లాలో మొత్తం భవనాలకు సంబంధించిన పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ, చాలా చోట్ల అధికారులు తగిన చొరవ తీసుకోకపోవడం వల్లే పనులు పెండింగ్లో ఉంటున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు
కొన్ని ప్రాంతాల్లో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. అలాంటి వారికి వెంటనే మొదలుపెట్టాలని నోటీసులు ఇవ్వడం జరిగింది. మరికొన్ని చోట్ల స్థలాల సమస్య ఉంది. దీనిని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఈ సమస్య పరిష్కారం కాగానే పనులు ప్రారంభిస్తాం.
– లక్ష్మణ్రావు, పంచాయతీరాజ్ ఈఈ
హెల్త్ సబ్సెంటర్లకు గ్రహణం
రెండేళ్ల క్రితం జిల్లాకు 95 మంజూరు
ఇప్పటి వరకు కేవలం 11 భవనాలు మాత్రమే పూర్తి
స్థల సమస్యతో చాలా చోట్ల ప్రారంభం కాని పనులు
‘పట్టణంలో ఆరు చోట్ల హెల్త్ సబ్
సెంటర్లకు సొంత భవనాలు నిర్మించడానికి ప్రభుత్వం రెండేళ్ల క్రితం నిధులు మంజూరు చేసింది. కానీ, ఇందులో ఇప్పటి వరకు ఒక్క చోట కూడా భవన నిర్మాణ పనులు ప్రారంభానికి నోచుకోలేదు. స్థానికంగా వాటికి అనువైన ప్రభుత్వ స్థలాలు లేకపోవడం వల్ల నిర్మాణ పనులు మొదలు పెట్టడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ సమస్య ఒక్క మెట్పల్లిలోనే కాదు.. జిల్లాలో చాలా చోట్ల ఉండడం సంబంధిత అధికారులకు తలనొప్పిగా
మారింది.’
జిల్లాకు మంజూరైన భవనాలు 95
ఇప్పటి వరకు పూర్తయినవి 11
వివిధ దశల్లో ఉన్నవి 23
పనులు ప్రారంభం కానివి 61

పైసలున్నా.. పనుల్లో జాప్యం