
అంబేడ్కర్ రాజ్యాంగంతోనే తెలంగాణ సాకారం
గొల్లపల్లి(ధర్మపురి): తెలంగాణ ఏర్పాటు కలను సాధ్యం చేసింది అంబేడ్కర్ రచించిన రాజ్యాంగమేనని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి జీవన్రెడ్డి అన్నారు. మండలంలోని శ్రీరాములపల్లె గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని మంగళవారం ఆవిష్కరించి మాట్లాడారు. అంబేడ్కర్ ముందుచూపుతో రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని వివరించారు. దేశంలోని అన్ని వర్గాలవారికి సమన్యాయం, సమాన అవకాశాలు చేకూర్చేలా రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందన్నారు. అంబేడ్కర్ దేశానికి చేసిన సేవలు మరువలేనివని, భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, మహామేధావి అయిన ఆ మహనీయునికి భారతరత్న ఇవ్వడం జరిగిందన్నారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
● ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్