చంద్రుడిపైకి మళ్లీ.. వ్యోమగాముల కోసం ఏకంగా అంతరిక్ష కేంద్రం

Nasa Sends Craft Capstone To Moon - Sakshi

వాషింగ్టన్‌: అంతరిక్ష పరిశోధనలో భాగంగా నాసా శాస్త్రవేత్తలు మళ్లీ చంద్రునిపై కాలుపెట్టనున్నారు. ఈసారి.. చంద్రుడిపై ప్రయోగాల సందర్భంగా వ్యోమగాములు తరచూ వినియోగించుకునేందుకు వీలుగా చందమామ సమీప కక్ష్యలో కొత్త అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణానికి ఏ కక్ష్య అనువుగా ఉంటుందో విషయాన్ని నిర్ధారించేందుకు మంగళవారం క్యాప్‌స్టోన్‌ అనే ఒక బుల్లి ఉపగ్రహాన్ని పంపారు.

ఒక మైక్రోవేవ్‌ పరిమాణముండే 25 కేజీల ఈ కృత్రిమ శాటిలైట్‌ను మోసుకెళ్లే రాకెట్‌ను న్యూజిలాండ్‌ నుంచి ప్రయోగించారు. క్యాప్‌స్టోన్‌ చందమామ సమీపానికి చేరుకుని దీర్ఘవృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తుంది. ఆ క్రమంలో చంద్రుడికి దగ్గరగా వచ్చినపుడు 2,200 మైళ్లదూరంలో, దూరం జరిగినపుడు 44 వేల మైళ్ల దూరంలో ఉంటుంది. ఇలాంటి కక్ష్యలో పరిభ్రమించనున్న తొలి కృత్రిమ ఉపగ్రహంగా చరిత్ర సృష్టించనుంది.

ఆర్నెల్ల పాటు శోధించి అక్కడి స్పేస్‌స్టేషన్‌ నిర్మాణ అనుకూల కక్ష్యల సమాచారాన్ని నాసాకు చేరవేస్తుంది. భవిష్యత్‌లో ఈ స్పేస్‌ స్టేషన్‌ నుంచే వ్యోమగాములు చందమామపై వేర్వేరు ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top