
టిబెట్ అటానమస్ రీజియన్ 60వ ఆవిర్భావ ఉత్సవాలకు హాజరు
బీజింగ్: టిబెట్ అటానమస్ రీజియన్(టీఏఆర్) 60వ ఆవిర్భావ ఉత్సవాలకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హాజరయ్యారు. రాజధాని లాసాలోని ప్రముఖ పొటాలా ప్యాలెస్ స్క్వేర్లో బుధవారం జరిగిన వేడుకల్లో వివిధ వర్గాల ప్రతినిధులు, అధికారులు సహా 20 వేల మంది పాలుపంచుకున్నట్లు అధికార వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. 2012లో జిన్పింగ్ అధికారంలోకి వచ్చాక లాసా రావడం ఇది రెండోసారి. టిబెట్ను రెండుసార్లు సందర్శించిన చైనా అధ్యక్షుడు కూడా ఈయనే.
టిబెట్కు సంబంధించిన అన్ని అంశాల్లోనూ అధికార కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వమే పైచేయిగా ఉండాలని అధికారులకు పిలుపునిచ్చారు. టిబెటన్ బౌద్ధమతం సోషలిస్ట్ సమాజానికి అనుగుణంగా మార్పు చెందడానికి టిబెట్, చైనాలోని ఇతర ప్రాంతాల మధ్య సంబంధాలను మరింతగా పెంచాల్సిన అవసరముందని చెప్పారు. బౌద్ధం, ఇస్లాం సహా అన్ని మతాలను చైనాలోని హన్ సంస్కృతి, సంప్రదాయాలను అలవర్చుకునేలా కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుండటం తెల్సిందే.
టిబెట్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద జలాశయాన్ని నిర్మిస్తోంది. అదేవిధంగా, చైనాలోని మిగతా ప్రాంతాలను కలుపుతూ టిబెట్లోని భారత సరిహద్దు వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)వరకు భారీ రైలు మార్గాన్ని నిర్మిస్తోంది. కాగా, లాసాలోని పొటాలా ప్యాలెస్ టిబెటన్ బౌద్ధ గురువులైన దలై లామాల నివాసంగా ఉండేది. శతాబ్దాలపాటు రాజకీయ, సాంస్కృతిక కేంద్రంగా పొటాలా కొనసాగింది. 1965లో చైనా ఆక్రమించుకోవడం, దలై లామా భారత్ సారథ్యంలోని టిబెటన్లు భారత్లో ఆశ్రయం పొందడం తెల్సిందే.