ఖిలా వరంగల్: వరంగల్ ఉర్సుగుట్ట సమీపంలోని ఖిలా వరంగల్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం ఉదయం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అఽధికారుల ఆకస్మిక తనిఖీలు కలకలకం సృష్టించాయి. అధికారులు కార్యాలయానికి ప్రవేశించి ప్రధాన ద్వారాన్ని మూసేశారు. రిజిస్ట్రేషన్లను నిలిపి ఎవ్వరినీ లోపలికి రానివ్వలేదు. స్టాంప్ డ్యూటీ చెల్లింపు, గడిచిన కొన్ని నెలలుగా జరిగిన రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లను డీఎస్పీ మల్లయ్య, తహసీల్దార్ లక్ష్మణ్, విజిలెన్స్ ఇన్స్పెక్టర్లు పరిశీలించారు. ఇన్చార్జ్ సబ్రిజిస్ట్రార్ వెంకట్లాల్కు పలు ప్రశ్నలు వేసి స్టాంప్ డ్యూటీల అవకతవకలపై ఆరా తీశారు. ఇటీవల జరిగిన లావాదేవీల గురించి అడిగి తెలుసుకున్నారు. భూముల క్రయవిక్రయాల్లో ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం స్టాంపు డ్యూటీ ఫీజులు కట్టించకపోవడం, అనధికారిక లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఆకస్మిక తనిఖీలు చేశారని అధికారులు తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తనిఖీలు కొనసాగాయి. లావాదేవీలను నమోదు చేసిన రికార్డుల ఫైళ్ల జిరాక్స్లను అధికారులు వెంట తీసుకెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం.
మూతపడిన డాక్యుమెంట్ రైటర్ల
కార్యాలయాలు
విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జనసందడిగా ఉండే రిజిస్ట్రేషన్ కార్యాలయం ఒక్కసారిగా బోసి పోయి కనిపించింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేపడుతుండగానే డాక్యుమెంట్ రైటర్స్ హడావుడిగా షట్టర్లు మూసివేశారు. తొలుత కార్యాలయంపై ఏసీబీ దాడులు జరుగుతున్నాయని ప్రచారం సాగింది. తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అఽధికారులు తనిఖీలు చేపడుతున్నట్లు తెలుసుకుని డాక్యుమెంట్ రైటర్లు తమ కార్యాలయాలను మూసివేసి వెళ్లిపోయారు. మధ్యాహ్నం 3 గంటలకు 18 డాక్యుమెంట్లు, రిజిస్టేషన్ల ప్రక్రియ యథావిధిగా కొనసాగింది.
కీలక ఫైళ్లను పరిశీలించిన విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు
స్టాంప్ డ్యూటీలో అవకతవకలపై
ఇన్చార్జ్ సబ్రిజిస్ట్రార్కు ప్రశ్నలు


