హసన్పర్తి: ప్రమాదాల బారిన పడకుండా వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు కచ్చితంగా పాటించేలా అవగాహన కల్పించడమే ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమ లక్ష్యమని రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (సీఐడీ) ఉమెన్ ‘సేఫ్టీ వింగ్ యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్ జనరల్, ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ డైరెక్టర్ చారు సిన్హా అన్నారు. గురువారం హసన్పర్తి మండలం భీమారం పరిధి కేఎల్ఎన్ కన్వన్షన్ హాల్లో పోలీస్ కమిషనరేట్, రవాణాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా రోడ్డు భద్రతపై ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి చారు సిన్హా ముఖ్య అతిథిగా హాజరై రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, వరంగల్ కలెక్టర్ సత్యశారద, జిల్లా రవాణాశాఖ అధికారి సురేశ్రెడ్డి మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు. ఈసందర్భంగా రోడ్డు ప్రమాదాలకు కారణాలు, మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలపై వీడియో ప్రదర్శించారు. సదస్సులో నగరానికి చెందిన ఓ కళాశాల విద్యార్థి తన తండ్రి హెల్మెట్ ధరించకపోవడంతో రోడ్డు ప్రమాదంలో మరణించాడని చెప్పడం అందరినీ ఆలోచింపజేసింది. ఈసందర్భంగా ద్విచక్రవాహనదారులకు హెల్మెట్లు అందించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీపీలు దార కవిత, అంకిత్కుమార్, వరంగల్ ఏఎస్పీ శుభం, ట్రెయినీ ఐపీఎస్ మనీషా నెహ్రూ, వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఎంవీఐలు వేణుగోపాల్, కిశోర్కుమార్, రాధోత్, శోభన్ బాబు, ఏసీపీలు నర్సింహారావు, ప్రశాంత్రెడ్డి, పోలీస్ ఇన్స్పెక్టర్లు చేరాలు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
అడిషనల్ డీజీపీ చారుసిన్హా
వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ


