
దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి
వరంగల్: ఈనెల 20వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన సార్వత్రిక సమ్మెను కార్మికులు విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నారపు రమేష్ పిలుపునిచ్చారు. సమ్మె విజయవంతానికి సహకారం అందించాలంటూ ములుగురోడ్డులోని సామిల్ అండ్ డింబర్ డిపో ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి కాసర్ల గోవర్ధన్కు సమ్మె నోటీసును శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామిల్ కార్మికులు చాలీచాలని వేతనాలతో దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారని వాపోయారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు దామెర కృష్ణ, తురాసి రాజు, ముకుందం, బక్కయ్య, మధు, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.