భారత్ రంగ్ మహోత్సవం ప్రారంభం
ఐదురోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాలు
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా–వేదిక సంయుక్తంగా నిర్వహిస్తున్న భారత్ రంగ్ మహోత్సవ్, అంతర్జాతీయ నాటక ఉత్సవం శుక్రవారం గుంటూరులోని శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేదిక అధ్యక్షుడు డాక్టర్ ముత్తవరపు సురేష్బాబు నేతృత్వంలో ఐదురోజులు కొనసాగనున్న ఈ ఉత్సవాలను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రతినిధి లీలాశర్మ, బెంగళూరు ప్రతినిధి వీణాశర్మ, ఏఎన్యూ థియేటర్ ఆర్ట్స్ డైరెక్టర్ నాగభూషణం, ఠాగూర్ మెమోరియల్ ట్రస్ట్ కార్యదర్శి రామచంద్రరాజు, నాటకరంగ ప్రముఖుడు కందిమళ్ళ సాంబశివరావు, నటుడు గోపీనాయుడు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా లీలాశర్మ మాట్లాడుతూ నాటకం కేవలం వినోద సాధనం మాత్రమేకాదని, సమాజాన్ని ప్రశ్నించే శక్తిమంతమైన మాధ్యమమని చెప్పారు. విశ్వవిద్యాలయ స్థాయిలో థియేటర్ ఆర్ట్స్కు లభిస్తున్న ప్రాధాన్యతను ఏఎన్యూ థియేటర్ ఆర్ట్స్ డైరెక్టర్ నాగభూషణం వివరించారు. అనంతరం కోరస్ రిపెర్టరీ థియేటర్ (మణిపురి) ఆధ్వర్యంలో కనుప్రియ నాటకాన్ని ప్రదర్శించారు. అంతకుముందు కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. గుంటూరు, నరసరావుపేట, యడ్లపాడు నుంచి వచ్చిన విద్యార్థినుల సంప్రదాయ నృత్యాలు, కోలాటం, నృత్య రూపకాలు ఆకట్టుకున్నాయి.


