అయితానగర్‌ను భయపెట్టేందుకే దాడి | - | Sakshi
Sakshi News home page

అయితానగర్‌ను భయపెట్టేందుకే దాడి

Jun 29 2025 2:46 AM | Updated on Jun 29 2025 2:46 AM

అయితానగర్‌ను భయపెట్టేందుకే దాడి

అయితానగర్‌ను భయపెట్టేందుకే దాడి

తెనాలి: పాలకులు పోలీస్‌ యంత్రాంగాన్ని గుప్పిట పెట్టుకుని ఎప్పుడు.. ఎవరిని వేధించాలని చూస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ దృక్పథాన్ని, సంస్కృతిని తీసుకురావాలని, ప్రశ్నించే తత్వానికి ఈ సదస్సు వేదిక కావాలని శనివారం రాత్రి తెనాలిలో జరిగిన మానవ హక్కుల పరిరక్షణ సదస్సులో పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. దళిత చైతన్యానికి, ఉద్యమాలకు గుండెకాయ వంటి అయితానగర్‌ను భయభ్రాంతులను చేసేందుకు యువకులపై బహిరంగ దాడి చేశారని ఆరోపించారు. పోలీసుల తీరునూ, వారిని సమర్థిస్తున్న పాలకుల వైఖరిని తీవ్రంగా ఖండించారు. న్యాయం జరిగే వరకు పోరాడాల్సిందేనని స్పష్టం చేశారు. తెనాలిలో ముగ్గురు దళిత, మైనారిటీ యువకులపై బహిరంగంగా థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన పోలీసుల అరాచకాన్ని, మానవ హక్కుల ఉల్లంఘనను నిలదీస్తూ తెనాలి అయితానగర్‌లోని కమ్యూనిటీ హాలులో జరిగిన సదస్సుకు సమన్వయకర్త పిల్లి విద్యాసాగర్‌ అధ్యక్షత వహించారు. రాజకీయ పార్టీలు, వివిధ దళిత, ప్రజాసంఘాలు మొత్తం 24 పైగా నిర్వాహక కమిటీగా జరిపిన సదస్సులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలీసులే కేసు పెట్టి, తీర్పులిచ్చి, శిక్షలు వేసేస్తుండటం దారుణమని పేర్కొన్నారు. తెనాలి పోలీసుల మానవ హక్కుల ఉల్లంఘనను సీపీఎం ఖండిస్తోందని తెలిపారు. మానవ హక్కులను కాపాడుకోవడమే మనముందున్న సమస్యగా స్పష్టం చేశారు.

● సీపీఐ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ మాట్లాడుతూ తెనాలి పోలీసుల దారుణంపై ప్రజాప్రతినిధులు, చివరికి హోం మంత్రి సహా సిగ్గుపడకపోగా సమర్థిస్తారా? అంటూ నిలదీశారు.

● కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎమ్మెల్యే షేక్‌ మస్తాన్‌వలి మాట్లాడుతూ పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని బహిరంగంగా శిక్షించమని ఏ చట్టం చెబుతోందని అన్నారు.

● ఎస్సీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఎం.విక్టర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ తెనాలిలో దళిత, మైనారిటీ యువకులపై కానిస్టేబుల్‌ చేసిన ఫిర్యాదు, వాస్తవంగా పెట్టీ కేసు మాత్రమేనని తెలిపారు. దీనిపై పలు సెక్షన్లతో కేసులు పెట్టటం ఏమిటని ప్రశ్నించారు.

● రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు దాసరి చెన్నకేశవులు మాట్లాడుతూ అయితానగర్‌లో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటుతోనే కుట్ర మొదలైందని చెబుతూ అందుకే సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషనులో స్థానిక ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్‌ పేరును చేర్చినట్టు తెలిపారు.

● ఏపీ ఎమ్మార్పీయస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దళితులు ఐకమత్యంగా పోరాటం చేసి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

● విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి దయాసాగర్‌ మాట్లాడుతూ తెనాలి పోలీసుల చర్య కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనేనని చెప్పారు.

● వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌జే విద్యా సాగర్‌ మాట్లాడుతూ పోలీసుల దాడివెనుక పోరాట స్ఫూర్తి కలిగిన అయితానగర్‌ను భయభ్రాంతులను చేయాలనే పాలకుల కుట్ర ఉందని తెలిపారు.

● మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నవరపు కిశోర్‌ మాట్లాడుతూ ఇంత ఆందోళన జరిగినా కనీసం పోలీసులపై చర్య తీసుకోలేదంటే దళితులపై ప్రభుత్వ చులకనభావమేనని పేర్కొన్నారు.

● సభాధ్యక్షుడు విద్యాసాగర్‌ మాట్లాడుతూ అతి త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన కీలక సాక్ష్యాలను బహిర్గతం చేస్తామని వెల్లడించారు.

ఇండియన్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ నేత జి.శాంతకుమార్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త ఉమామహేశ్వరరావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వై.నేతాజీ, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి, మహిళా సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర నాయకురాలు సుంకర పద్మశ్రీ , కేవీపీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, మాల ఉద్యోగుల సంఘం నేత కిశోర్‌బాబు, కులనిర్మూలన సమితి రాష్ట్ర కార్యదర్శి కె.కృష్ణ, ఇండియన్‌ లీగల్‌ ప్రోగ్రెసివ్‌ అసోసియేషన్‌ నేత మణి, పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు చిలకా చంద్రశేఖర్‌, భగత్‌సింగ్‌, వేముల మురళి, నీలాంబరం, ఓపీడీఆర్‌ రాష్ట్ర అధ్యక్షుడు చావలి సుధాకర్‌, దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్రం, ఆర్‌పీఐ పార్టీ అంబేడ్కరైట్‌ రాష్ట్ర అధ్యక్షుడు పి.రవిప్రసాద్‌, తెనాలి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్‌ మాట్లాడారు. దళిత బహుజన ఫ్రంట్‌ కొరివి వినయ్‌కుమార్‌ స్వాగతం పలికారు.

మానవ హక్కుల పరిరక్షణ సదస్సులో వక్తలు పోలీసుల తీరు, సమర్థిస్తున్న పాలకుల వైఖరిపై ఆగ్రహం తీవ్రంగా ఖండించిన రాజకీయ పార్టీలు, దళిత, ప్రజా సంఘాల రాష్ట్ర నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement