
కూటమి ప్రభుత్వానివి ఓటు బ్యాంకు రాజకీయాలు
ఏలూరు (ఆర్ఆర్పేట): పుట్టపర్తి సత్య సాయిబాబా జయంతిని కూటమి ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా జరపాలను కోవడం ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగమేనని ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం జిల్లా అధ్యక్షుడు కడలి రామాంజనేయులు విమర్శించారు. మంగళవారం స్థానిక ఆర్ఆర్ పేట స్ఫూర్తి భవనంలో హేతువాద సంఘం నాయకుడు కోడూరి సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. సైంటిఫిక్ టెంపర్ను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం మహిమల పేరుతో ప్రసిద్ధుడైన సత్య సాయిబాబా జయంతిని అధికారికంగా జరపాలను కోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వాలు బాబాల పట్ల చూపిన గౌరవం, మహాకవి శ్రీ శ్రీ, గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, గుర్రం జాషువాల పట్ల చూపకపోవడం విచారకరమన్నారు. సమావేశంలో ముందుగా ఇటీవల మరణించిన హేతువాది, నటుడు అల్లం గోపాలరావు, అవయవ దాన ఉద్యమ నాయకురాలు పేరేచర్ల లక్ష్మీకాంతంలకు ఘనంగా నివాళులు అర్పించారు. సీపీఐ నాయకుడు బండి వెంకటేశ్వరరావు, ఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే, హేతువాద సంఘ నాయకులు పాల్గొన్నారు.