
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
రాజమహేంద్రవరం రూరల్: వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొంతి ఆస్కరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బొమ్మూరులోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం ఆవరణలో సోమవారం నిర్వహించిన సంఘం సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తమ సంఘం 2002లోనే గుర్తింపు సాధించిందన్నారు. అవకాశవాద రాజకీయానికి అలవాటు పడి, ఆయా సంఘాల్లో తలదాచుకొన్న కొందరు టీడీపీ ప్రభుత్వం రాగానే తెలుగునాడు వైద్య, ఆరోగ్య ఉద్యోగుల సంఘం పేరుతో హడావుడి చేస్తూ తమ సంఘాన్ని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. కావాలంటే మరోమారు గుర్తింపు ఎన్నికలు నిర్వహించుకొని, తమపై గెలవాలే తప్ప, అధికారంలో ఉన్న నాయకులకు అసత్యాలు చెప్పి, ఉద్యోగుల శ్రేయస్సు కోసం శ్రమిస్తున్న గుర్తింపు సంఘాన్ని ఇబ్బంది పెట్టడం సరి కాదని హితవు పలికారు. సంఘ ఎన్నికల అనంతరం నూతన కార్యవర్గాన్ని జిల్లాల ఉన్నతాధికారులకు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ గత ఏడాది జూన్ 24న సర్క్యులేట్ చేశారన్నారు. ఆ అధికారిపై తెలుగునాడు ఉద్యోగుల సంఘం తీవ్రమైన రాజకీయ ఒత్తిడి తేవడంతో గత ఏడాది జూలై 12న కార్మిక శాఖకు క్లారిఫికేషన్ లేఖ రాసి, తమ సంఘం గుర్తింపును తదుపరి ఉత్తర్వుల వరకూ అబేయెన్స్లో పెట్టించారన్నారు. తదుపరి ఎన్నికలు జరిగి, మరో సంఘం గుర్తింపు పొందే వరకూ గత సంఘం గుర్తింపు కొనసాగుతుందని ఏడు నెలల అనంతరం కార్మిక కమిషనర్ శేషగిరిబాబు వివరణ ఇచ్చారన్నారు. దీంతో ఈ ఏడాది మార్చి 9న హెల్త్ డైరెక్టర్ తమ సంఘం గుర్తింపును పునరుద్ధరించారన్నారు. కానీ, బూటకపు నాయకులు ఈ ఉత్తర్వుల రద్దు కోసం కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారన్నారు. ఇటువంటి దగాకోరు విధానాలు కట్టిపెట్టకపోతే తాము కూడా ప్రతిఘటిస్తామని ఆస్కరరావు హెచ్చరించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో గుర్తింపు లేని సంఘ నాయకులు, ఉద్యోగుల ప్రయోజనాలకు మోకాలడ్డుతున్నారని, వారిని కట్టడి చేయకపోతే ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. కొంత మంది కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం తొలగించిందని, వెంటనే వారిని తిరిగి విధుల్లో చేర్చుకోవాలని డిమాండ్ చేశామని ఆస్కరరావు చెప్పారు.