2,80,683 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం: జేసీ
అమలాపురం రూరల్: ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 56,827 మంది రైతుల నుంచి రూ.665 కోట్ల విలువైన 2,80,683 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. బుధవారం అమలాపురం కలెక్టరేట్లో ఆమె మాట్లాడుతూ జిల్లాలో మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, ఇప్పటికే 2,80,683 మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తయినట్లు వెల్లడించారు. ధాన్యం విక్రయాల్లో ఇబ్బందులుంటే జిల్లా కార్యాలయంలో ఏర్పాటైన కంట్రోల్ రూమ్ నంబర్ 83094 32487, సెల్ నంబర్ 94416 92275ను సంప్రదించాలన్నారు. అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని గ్రామ పంచాయతీల్లో అనధికారికంగా నిర్మించిన భవనాలను బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్) ద్వారా క్రమబద్ధీకరించుకునే దిశగా ఆ భవన యజమానులకు అవగాహన కల్పించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి అడపా ఉదయభాస్కర్, జిల్లా పౌరసరఫరాల విభాగం మేనేజర్ పి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
సిబ్బందికి అవగాహన అవసరం
ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ– ఆఫీస్ నిర్వహణపై సిబ్బందికి అవగాహన ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. కలెక్టరేట్లో ఉద్యోగులతో ఆమె సమావేశమయ్యారు. జనవరి నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు ఈ– ఫైల్ ద్వారా నిర్వహించాలన్నారు. వెబ్సైట్లో ప్రభుత్వ లోగో, కాపీరైట్ పాలసీ, ప్రైవసీ పాలసీ, టర్మ్స్ అండ్ కండీషన్లు తప్పనిసరిగా చూడాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆఫీస్ వెబ్సైట్ నిర్వహణ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఉండాన్నారు. డీఆర్వో కె.మాధవి, సుబ్బరాజు, వంశీ, నాగలక్ష్మమ్మ భరత్ పాల్గొన్నారు.


