
సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలకు వేళాయె..
రాయవరం: విద్యా సంవత్సరంలో విద్యార్థి అభ్యసన మదింపునకు విద్యాశాఖ ఏటా ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలను గతేడాది నుంచి సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 1, 2, 3, 4గా వ్యవహరిస్తున్నారు. 2025– 26 విద్యా సంవత్సరంలో నాలుగు సెల్ఫ్ అసెస్మెంట్, రెండు సమ్మేటివ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో తొలి సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్–1 (శాంప్) ఈ నెల 11 నుంచి నిర్వహించనున్నారు. విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు నిర్వహిస్తున్న సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలను 2022–23 విద్యా సంవత్సరం నుంచి ప్రయోగాత్మక విధానంలో ‘క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్’ను ప్రవేశపెట్టారు. ఇదే విధానాన్ని ప్రస్తుత విద్యా సంవత్సరంలోనూ కొనసాగిస్తున్నారు. గత విద్యా సంవత్సరం 1–8 తరగతుల వరకూ సీబీఏ విధానం అమలు చేయగా, ఈ ఏడాది 9వ తరగతికి కూడా సీబీఏ విధానాన్ని తీసుకొచ్చారు. కేవలం 10వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఫార్మేటివ్–1 పరీక్షలను జరపనున్నారు.
అకడమిక్ క్యాలెండర్ ప్రకారం
ప్రస్తుత విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభమైంది. ముందుగా పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పరీక్షలు ఈ నెల 4 నుంచి నిర్వహించాల్సి ఉండగా, అసెస్మెంట్ బుక్లెట్స్ జిల్లాకు చేరుకోవడం ఆలస్యం కావడంతో ఈ నెల 11కు వాయిదా వేశారు. జూన్, జూలై సిలబస్కు సంబంధించి విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాల మదింపునకు సీబీఏ, ఫార్మేటివ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సిలబస్తో పాటు, 6వ తరగతికి రెడీనెస్ ప్రోగ్రామ్పై పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షల ద్వారా అభ్యసన లోపాలను గుర్తించడంతో పాటు, పక్కా బోధనతో వారిలో సామర్థ్యాలను వెలికితీయడం సీబీఏ పరీక్షల ప్రధాన ఉద్దేశం. 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు సెల్ఫ్ అసెస్మెంట్–1, 3, ఎస్ఏ 2కు ఫార్మేటివ్కు బదులుగా సీబీఏ విధానంలో నిర్వహిస్తుండగా, ఎఫ్ఏ 2, 4, ఎస్ఏ 1 పాత విధానంలోనే నిర్వహించనున్నారు. 10వ తరగతికి నాలుగు ఎఫ్ఏలు, రెండు సమ్మేటివ్ పరీక్షలు పాత విధానంలో అమలు చేస్తారు.
బైలింగ్విల్ ప్రశ్నపత్రాలు
సీబీఏ విధానంలో నిర్వహిస్తున్న పరీక్షలకు విద్యార్థులకు ఇచ్చే ప్రశ్నపత్రం బైలింగ్విల్ విధానంలో ఉంటుంది. విద్యార్థికి ఇంగ్లిష్లో ప్రశ్నపత్రం అర్థం కాకుంటే తెలుగులో చదివి ప్రశ్నను అర్థం చేసుకునేందుకు 2023–24 విద్యా సంవత్సరం నుంచి బైలింగ్విల్ ప్రశ్నపత్రాలను ప్రవేశపెట్టారు. ప్రశ్నపత్రంలోని 10 ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో, ఐదు ప్రశ్నలు రాత పూర్వక విధానంలో ఇస్తారు. మొత్తం 15 ప్రశ్నలకు 20 మార్కులు కేటాయిస్తారు. మెకానికల్.. అండర్ స్టాండింగ్.. అప్లికేషన్ (ఎంయూఏ) ప్రశ్న పత్రం ఉంటుంది. ఓఎంఆర్ పత్రాల్లో జవాబులు నింపి జిల్లాకు పంపించాల్సి ఉంటుంది. సీబీఏ విధానంలో పరీక్షలు రాసే విద్యార్థులు ప్రశ్నలకు సమాధానాలను ఓఎంఆర్ షీట్లలో నింపాల్సి ఉంటుంది. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు మాత్రం రాతపూర్వక సమాధానాలు రాస్తే సరిపోతుంది.
ఈ నెల 11 నుంచి 14 వరకూ నిర్వహణ
అభ్యసనం మదింపునకు ప్రక్రియ
జిల్లాలో 1.95 లక్షల మంది విద్యార్థులు
జిల్లాలో విద్యార్థులు ఇలా..
సీబీఏ విధానంలో నిర్వహించే పరీక్షలు ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకూ నిర్వహిస్తారు. ఎయిడెడ్, ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ యాజమాన్యాల్లో 1–5 తరగతుల వరకు 30,616 మంది, 6–10 తరగతుల వరకు 58,651 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ప్రైవేటు యాజమాన్యంలో 464 పాఠశాలలకు సంబంధించి 1,05,965 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలో 1,95,690 మంది విద్యార్థులు ఉండగా, ప్రభుత్వ యాజమాన్యంలో 89,625 మంది, ప్రైవేట్ యాజమాన్యంలో 1,05,965 మంది విద్యార్థులున్నారు.
అవసరమైన ఏర్పాట్లు చేశాం
ప్రశ్న పత్రాలను, ఓఎంఆర్ షీట్లను జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ సరఫరా చేశాం. పరీక్ష పేపర్లకు ఎంఈఓలు కస్టోడియన్లుగా వ్యవహరిస్తారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని మార్గదర్శకాలు ఎంఈఓలు, పాఠశాలల హెచ్ఎంలకు జారీ చేశాం.
–బీర హనుమంతరావు, డీసీఈబీ కార్యదర్శి, అమలాపురం
పేపర్ లీకై తే కఠిన చర్యలు
మూడేళ్లుగా క్లాస్ రూమ్ బేస్ట్ అసెస్మెంట్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఈ విధానంపై విద్యార్థులు, ఉపాధ్యాయులకు పూర్తి అవగాహన ఉంది. ఈ విద్యా సంవత్సరంలో పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పరీక్ష పేపర్లు లీకై తే సంబంధితులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
–డాక్టర్ షేక్ సలీం బాషా, డీఈఓ, అమలాపురం

సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలకు వేళాయె..

సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలకు వేళాయె..