
కలెక్టరేట్ వద్ద రైతుల రిలే దీక్షలు రేపు
● ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి
● కలెక్టర్ మహేష్కుమార్కు వినతి పత్రం
అమలాపురం రూరల్: రబీలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ప్రభుత్వం మిల్లర్లు, దళారులతో కుమ్మకై ్కందని, ఇందుకు నిరసనగా బుధవారం కలెక్టరేట్ వద్ద రైతులతో రిలే నిరాహార దీక్ష చేస్తామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో జగ్గిరెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసి రైతులను ప్రభుత్వం ఆదుకోకుంటే వారికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు. రబీ ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి 369 కేంద్రాలు ఉండగా జిల్లాలో ఏ ఒక్కచోట కొనుగోలు చేయడం లేదన్నారు. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని కోరారు. బుధవారం ఉదయం 9:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జిల్లాలో ఏడు నియోజకవర్గాల నుంచి 100 మంది రైతులు, నాయకులుతో భారీ ఎత్తున నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు. జిల్లాలో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధిస్తే కేవలం 98 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసి, ధాన్యం సేకరణ నిలిపివేశారని అన్నారు. టార్గెట్ పేరుతో 24శాతం ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, కూటమి ప్రభుత్వంలో రైతుల కన్నా మిల్లర్లకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. వాతావరణంలో మార్పులతో రైతులకు కంటి మీద కునుకు లేకుండా ఉందని, వారినిని పట్టించుకునే నాథులు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ వెంటనే ప్రశ్నించి రైతులకు అండగా ఉండాలని అన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిచిపోతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతిలో కూర్చుని ఫిడేల్ వాయిస్తున్నారని అన్నారు. ఆయన కేవలం అమరావతికే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రైతు కష్టాల్లో ఉంటే కూటమి నాయకులు మొద్దు నిద్రలో ఉన్నారని అన్నారు. జిల్లాలో రైతుల కష్టాలను వివరిస్తూ కలెక్టర్ మహేష్కుమార్కు వినతి పత్రం అందించారు. జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, నియోజకవర్గ సమన్వయకర్తలు డాక్టర్ పినిపే శ్రీకాంత్, గొల్లపల్లి సూర్యారావు, పిల్లి సూర్యప్రకాష్రావు, గన్నవరపు శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, కుడుపూడి సూర్యనారాయణరావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వంగా గిరిజాకుమారి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్రాజు, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఖాదర్, కాశీ బాలమునికుమారి, ఐటీ విభాగం అధ్యక్షుడు తోరం గౌతమ్. గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు కంఠంశెట్టి ఆదిత్యకుమార్, పట్టణ అధ్యక్షుడు సంసాని నాని పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ నాయకులను
అడ్డుకున్న పోలీసులు
రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని శాంతియుతంగా వైఎస్సార్ సీపీ నాయకులు కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నించగా గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కొంతమందిని మాత్రమే లోనికి పంపుతామని పోలీసులు చెప్పడంతో వైఎస్సార్ సీపీ నాయకులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి జోక్యం చేసుకొని నియోజవర్గ కోఆర్డినేటర్లు, ముఖ్య నాయకులను లోనికి పంపాలని కోరారు. శాంతియుతంగా వినతి పత్రం ఇవ్వడానికి వచ్చామని ఆయన చెప్పడంతో ముఖ్య నాయకులను పోలీసులు కలెక్టరేట్ లోపలకు పంపించారు.