కలెక్టర్లు హాజరు కాకుంటే ఎలా? | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్లు హాజరు కాకుంటే ఎలా?

Mar 16 2025 12:06 AM | Updated on Mar 16 2025 12:06 AM

కలెక్

కలెక్టర్లు హాజరు కాకుంటే ఎలా?

కాకినాడ సిటీ: జెడ్పీ సర్వసభ్య సమావేశంలో అజెండాలోని అంశాలపై జరిగే చర్చలకు తూర్పుగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీన జిల్లాల కలెక్టర్లు హాజరు కాకపోవడంపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరావులతో పాటు ఆయా జిల్లాల జెడ్పీటీసీ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం పనుల ద్వారా సమకూరిన మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులను, గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌ల తీర్మానాలతో ప్రమేయం లేకుండా కలెక్టర్లు తమ ప్రాధాన్యం ప్రకారం కేటాయించడంపై సభ్యులు అభ్యంతరం తెలుపుతూ, ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని చైర్మన్‌ వేణుగోపాలరావును కోరారు.

మూడు జిల్లాలోని గోదావరి కాలువ చివరి ఆయకట్టు భూముల్లోని పంటలు సాగునీరు అందక ఎండిపోతున్న పరిస్థితిపై సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ, వంతుల వారీ విధానం, డ్రైన్ల నుంచి లిఫ్టింగ్‌ ద్వారా పంటలను కాపాడాలని కోరారు. కాలువల ఎగువ ప్రాంతాల్లోని రైతులకు సక్రమంగా నీటిని వదులుతున్నప్పటికీ అదనపు నీటిని అక్రమంగా తోడుతుండడం వల్ల శివారు భూములకు నీరు అందడం లేదని, ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కాకినాడ జిల్లా కలెక్టర్‌ షణ్మోహన్‌ హెచ్చరించారు.

తాళ్లరేవు జెడ్పీటీసీ సభ్యులు దొమ్మేటి శామ్యూల్‌ సాగర్‌ మాట్లాడుతూ యానాం–ద్రాక్షారామ ప్రధాన రహదారిలో ఆరేళ్లుగా వంతెన శిథిల స్థితికి చేరడం వల్ల కాలువకు తూరలు వేసి పైన సీసీ రోడ్డు వేశారని, ఫలితంగా నీరు సక్రమంగా పారకపోవడం, ఆ రహదారిలో రాకపోకలు సాగిస్తున్న సుమారు 40 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఇంజరం వద్ద పూర్తి స్థాయిలో వంతెన నిర్మించి రైతులను ఆదుకోవాలని, ప్రజల రాకపోకలలో ఇబ్బందులు తొలగించాలని కలెక్టర్‌ కోరారు. దీనిపై కలెక్టర్‌ షణ్మోహన్‌ స్పందించి ఈ విషయం పూర్తి స్థాయిలో అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అలాగే పౌరసరఫరాల ద్వారా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, హాస్టళ్లకు పంపిణీ చేస్తున్న నాసిరకమైన కొత్త బియ్యం వండినప్పుడు ముద్దవుతోందని, పిల్లలు తినడానికి ఇష్టపడడం లేదని కొందరు సభ్యులు ప్రస్తావించారు. మండలాల్లో నిర్వహించిన పనులకు చెల్లింపులు జాప్యం లేకుండా జరపాలని కోరారు.

జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమాలు జిల్లాలో విస్తృతంగా నిర్వహించాలని, ఆరోగ్యంపై వ్యయాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన జనరిక్‌ మందుల షాపులపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు కోరారు.

కారుణ్య నియామకాలను వేగవంతం చేయాలని, ఉద్యోగులకు జీపీఎఫ్‌ స్లిప్పులు జారీ చేయాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.

గిరిజన ప్రాంత ప్రజల సమస్యలపై చర్చ, పరిష్కారానికి ఐటీడీఏ సర్వ సభ్య సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌తో పాటు, ఏఎస్‌ఆర్‌ జిల్లా పరిధి జెడ్పీటీసీ సభ్యులు కోరారు. దీనిపై ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం స్పందిస్తూ ఏప్రిల్‌ చివరి లేదా మే తొలివారంలో తదుపరి సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపారు. అలాగే గిరిజన ప్రాంత సమస్యలపై సభ్యులు ప్రస్తావించిన అంశాలకు ఆయన వివరణలు ఇచ్చి సమస్యలన్నింటినీ సత్వరం పరిష్కరిస్తామన్నారు.

తమ జిల్లాలకు సంబంధించి సభ్యులు లేవనెత్తిన అంశాలపై చర్యలు చేపడతామని తూర్పుగోదావరి జిల్లా జేసీ చినరాముడు, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా డీఆర్వో రాజకుమారి సభ్యులకు వివరించారు.

సమావేశం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన సభ్యులు, అధికారులకు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో సభ్యులు ప్రస్తావించిన ప్రజాసమస్యలపై సత్వరం సమగ్ర పరిష్కారాలు అందించాలని నాలుగు జిల్లాల అధికారులను చైర్మన్‌ వేణుగోపాలరావు కోరారు. ఈ సమావేశంలో జెడ్పీ వైస్‌ చైర్మన్లు బుర్రా అనుబాబు, మేరుగు పద్మలత, జెడ్పీ సీఈవో వీవీవీఎస్‌ లక్ష్మణరావు, డిప్యూటీ సీఈవో రామ్‌గోపాల్‌, ఏవో ఎం.బుజ్జిబాబు, జెడ్పీటీసీ సభ్యులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని నాలుగు జిల్లాల అధికారులు పాల్గొన్నారు.

రూ.70 లక్షల మిగులు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్‌ సర్వసభ్య సమావేశం 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.70 లక్షల మిగులుతో రూ.1,014 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించింది. ఉమ్మడి జెడ్పీ బడ్జెట్‌ సర్వసభ్య సమావేశం శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో జిల్లా కలెక్టర్‌ షణ్మోహన్‌ సగిలి, తూర్పుగోదావరి జిల్లా జేసీ ఎస్‌ చినరాముడు, రంపచోడవరం జేసీ కట్టా సింహాచలం, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా డీఆర్‌ఓ బీఎల్‌ఎస్‌ రాజకుమారి పాల్గొన్నారు. సమావేశాన్ని జెడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు ప్రారంభించగా తొలుత దివంగతులైన కాట్రేనికోన ఎంపీపీ పాలెపు లక్ష్మి మృతికి సంతాపం ప్రకటిస్తూ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సమావేశంలో 2024–25 సంవత్సరానికి సవరించిన బడ్జెట్‌ను, 2025–26 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన అంచనా బడ్జెట్‌ ముసాయిదాను జెడ్పీ పరిపాలనాధికారి సభ్యులకు వివరించారు. అనంతరం బడ్జెట్‌లో పొందుపరిచిన ప్రతిపాదనలపై సమవేశం చర్చించి 2024–25 సంవత్సరానికి సవరించిన ఆదాయం రూ. 846.60 కోట్లు, సవరించిన వ్యయం రూ. 845.95 కోట్లతో రూ.65 లక్షలు మిగులుతో సవరించిన బడ్జెట్‌ను ఆమోదించారు. అదే విధంగా రానున్న 2025–26 ఆర్థిక సంవత్సరానికి అన్ని పద్దులు కలిపి మొత్తం ఆదాయం అంచనా రూ.1013.80 కోట్లు కాగా, అన్ని పద్దుల కింద అంచనా వ్యయం రూ. 1013.10 కోట్లతో, రూ.70 లక్షలు మిగులు బడ్జెట్‌ను సమావేశం ఆమోదించింది. ఆదాయంలో జెడ్పీ సాధారణ నిధులు రూ. 28 కోట్లు, ప్రభుత్వం నుంచి కేటాయించిన శాలరీ గ్రాంటులు రూ.10.48 కోట్లు, నిర్థిష్ట ప్రయోజన గ్రాంటు రూ.46.09 కోట్లు, డ్వామా, గ్రామీణ నీటి సరఫరా, ఇతర శాఖల ద్వారా వచ్చే గ్రాంటు రూ. 922.39 కోట్లుగా ఉన్నాయి. జెడ్పీ సాధారణ నిధుల నుంచి షెడ్యూల్‌ కులాల సంక్షేమానికి 15 శాతం కేటాయింపు రూ. 2.97 కోట్లు, షెడ్యూల్‌ తెగల సంక్షేమానికి 6 శాతం కేటాయింపు రూ.1.19 కోట్లు, మహిళా శిశు సంక్షేమానికి 15 శాతం కేటాయింపు, రూ.2.97 కోట్లు, అభివృద్ధి పనులకు 23 శాతంగా రూ.4.55 కోట్లు, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పశుసంవర్థక, సాంఘిక సంక్షేమం తదితర సెక్టార్లకు 10 శాతంగా రూ. 2.97 కోట్లు కేటాయింపులను సర్వసభ్య సమావేశం ఆమోదించింది. ఈ సందర్భంగా జిల్లా పరిషత్‌ ఆస్తులను పరిరక్షిస్తూ, ఆదాయ వనరులను మరింత పెంచాలని సభ్యులు కోరారు.

రూ.1014 కోట్లతో బడ్జెట్‌కు ఆమోదం

తూర్పుగోదావరి, కోనసీమ

జిల్లా అధికారులపై సభ్యుల ధ్వజం

పలు అంశాలపై జెడ్పీ సమావేశంలో చర్చ

కలెక్టర్లు హాజరు కాకుంటే ఎలా? 1
1/1

కలెక్టర్లు హాజరు కాకుంటే ఎలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement