
జర్నలిస్టులపై కేసులు .. స్వేచ్ఛను హరించడమే
చిత్తూరు అర్బన్: పత్రికల్లో వార్తలు రాసినందుకు గాను జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ.. భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే అవుతుందని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్ల్యూజే) జిల్లా అధ్యక్షులు ఎం.లోకనాథన్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కేఎం.అశోక్కుమార్ స్పష్టం చేశారు. జర్నలిస్టులపై ఏదైనా ఫిర్యాదుల వస్తే వాటిలో వాస్తవాలు విచారించి ఆపై పోలీసులు నిర్ణయం తీసుకోవాలని చిత్తూరు ఎస్పీ మణికంఠను కోరారు. కుప్పం నియోజకవర్గంలో ఓ వార్త రాసినందుకు గాను స్థానిక సాక్షి రిపోర్టర్ నాగరాజు పై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడం .. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసిన విషయంపై ఏపీయూడబ్ల్యూజే నాయకులు చిత్తూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మణికంఠ చందోలుతో చర్చించారు. జర్నలిస్టులను యాజమాన్యాలతో ముడి పెట్టొద్దని.. తమను పాత్రికేయులు గానే గుర్తించి.., హక్కులను రక్షించడానికి పోలీసు శాఖ చొరవ చూపాలని కోరారు. సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో పాత్రికేయులు పనిచేస్తున్నారని తెలిపారు. పాత్రికేయుల హక్కులు, కలం గౌరవాన్ని కాపాడాలని కోరారు. పాత్రికేయులపై జరుగుతున్న దాడులను నివారించడానికి కమిటీని సైతం రూపొందిస్తామని ఇటీవల కలెక్టర్ హామీ ఇచ్చిన విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఎస్పీ స్పందిస్తూ.. రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు పోలీసు శాఖ కట్టుబడి ఉందన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా ఎప్పుడూ ఎవరిపైనా ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఎస్పీ స్పష్టం చేశారు. పత్రికల్లో వార్త రాయడంతో పాటు వాటిని ఉదేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేయడం, వ్యక్తిగత దూషణలకు దిగారు అనే ఫిర్యాదు పైనే కేసు నమోదు చేయాల్సి వచ్చిందన్నారు. విచారణలో సంబంధిత రిపోర్టర్ ప్రమేయం లేదని తేలితే తదుపరి చర్యలు ఉండబోవని హామీ ఇచ్చారు. పాత్రికేయుల రక్షణ కోసం ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని తాము కచ్చితంగా పాటిస్తామన్నారు. కలెక్టర్తో మాట్లాడి పాత్రికేయులపై దాడుల నివారణ కమిటీని సైతం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్పీని కలిసిన వారిలో చిత్తూరు ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.