
విలీనంపై రగడ
బైరెడ్డిపల్లె: తమ గ్రామంలోని పాఠశాలను విలీనం చేయడంపై మండలంలోని మిట్టపల్లె గ్రామస్తులు శనివారం పలమనేరు–కుప్పం జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ గ్రామంలో 1 నుంచి 5వ తరగతి వరకు 32 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. అయితే ఇందులో 3, 4, 5 తరగతుల విద్యార్థులను కిలో మీటర్ దూరంలోని నాగిరెడ్డిపల్లె పాఠశాలలో విలీనం చేశారని చెప్పారు. ఉదయం, సాయంత్రం విద్యార్థులు వ్యవసాయపొలాల గుండా వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. 20 రోజులుగా విద్యార్థులు పాఠశాలకు వెళ్లడం లేదన్నారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. సుమారు 30 నిమిషాల పాటు జాతీయ రహదారిపై బైఠాయించడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బైరెడ్డిపల్లె ఎస్ఐ పరశురాముడు ఘటనా స్థలానికి చేరుకుని తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. ఎంపీడీఓ రాజేంద్రబాలాజీ, ఎంఈఓ సుబ్రమణ్యంకు వినతి పత్రం అందజేశారు.

విలీనంపై రగడ