న్యూఢిల్లీ: భారత్ జీడీపీపై ఆర్థిక సహకార, అభివృద్ధి సమాఖ్య (ఓఈసీడీ) ఆశావహ అంచనాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) జీడీపీ 7.6 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2026–27) 6.1 శాతానికి పరిమితం అవుతుందని తెలిపింది. ఈ మేరకు మధ్యంతర అంచనాలను వెల్లడించింది. మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులతో ఆయా దేశాల్లో ప్రజలు, ఆర్థిక వ్యవస్థలపై ఆర్థిక భారం పడుతుందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలాన్ని ఇది పరీక్షిస్తుందని పేర్కొంది.
హర్మూజ్ జలసంధిని మూసివేయడంతోపాటు, ఇంధన వసతులను దెబ్బతీయడాన్ని ప్రస్తావించింది. ‘‘యూఎస్ టారిఫ్లు తగ్గడం భారత వృద్ధికి అనుకూలిస్తుంది. గ్యాస్ కొరతతో ఉత్పత్తి కార్యకలాపాలకు కొంత మేర విఘాతం కలగొచ్చు. అయితే, ద్రవ్యపరమైన ఉద్దీపనల మద్దతుతో దీన్ని అధిగమించొచ్చు. ఈ పరిణామాల దృష్ట్యా భారత వృద్ధి రేటు 2025–26లో ఉండే 7.6 శాతం నుంచి 2026–27లో 6.1 శాతానికి పరిమితం కావొచ్చు. 2027–28లో 6.4 శాతానికి చేరుకోవచ్చు’’అని ఓఈసీడీ తెలిపింది.
ఆహారం, ఇంధన ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం 2025–26లో ఉండే 2 శాతం నుంచి 2026–27లో 5.1 శాతం, 2027–28లో 4.1 శాతానికి చేరుతుందని అంచనా వేసింది. వర్ధమాన దేశాల్లో ఒక్క భారత్లో మాత్రం ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను సర్దుబాటు చేసేందుకు సెంట్రల్బ్యాంక్ జూన్ త్రైమాసికంతో తాత్కాలికంగా రేట్లను పెంచొచ్చని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వృద్ధి 2026లో 2.9 శాతం, 2027లో 3 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.


