Crude Oil Production In 2022: తగ్గిన భారత్‌ ముడి చమురు ఉత్పత్తి

Crude Oil Production Declined In 2022 April - Sakshi

ఏప్రిల్‌లో ప్రైవేటు రంగం డౌన్‌

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగం నిర్వహిస్తున్న క్షేత్రాల నుండి తక్కువ ఉత్పత్తి కారణంగా ఏప్రిల్‌లో భారత్‌ ముడి చమురు ఉత్పత్తి 1 శాతం పడిపోయిందని అధికారిక డేటా వెల్లడించింది. 2021 ఏప్రిల్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ఉత్పత్తి 2.5 మిలియన్‌ టన్నులుకాగా, 2022 ఏప్రిల్‌లో ఈ పరిమాణం 2.47 మిలియన్‌ టన్నులకు తగ్గినట్లు పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వశాఖ పేర్కొంది. ప్రైవేట్‌ రంగం నిర్వహిస్తున్న క్షేత్రాల నుంచి వార్షికంగా చూస్తే 7.5 శాతం తక్కువ ముడి చమురు (5,67,570 టన్నులు) ఉత్పత్తి జరిగింది.  

ప్రభుత్వ రంగం దూకుడు.. 
కాగా వేర్వేరుగా చూస్తే, ఏప్రిల్‌లో ప్రభుత్వ రంగ సంస్థల ఉత్పత్తి పెరిగింది. చమురు, సహజ వాయువుల కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ) గత ఏడాది ఏప్రిల్‌ నెల ఉత్పత్తి 1.63 మిలియన్‌ టన్నులుకాగా, ఈ పరిమాణం తాజా సమీక్షా నెలలో 1.65 మిలియన్‌ టన్నులకు చేరింది. పెరుగుదల 0.86 శాతంకాగా, ఓఎన్‌జీసీ నిర్దేశించుకున్న లక్ష్యంకన్నా ఈ పరిమాణం 5 శాతం అధికం. ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ (ఓఐఎల్‌) 3.6 శాతం ఎక్కువ ముడి చమురును ఉత్పత్తి చేసింది. పరిమాణంలో ఇది 2,51,460 టన్నులు. 

సహజ వాయువు ఉత్పత్తి ఇలా... 
కాగా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌. బీపీ కృష్ణా గోదావరి–డీ 6 బ్లాక్‌కు నిలయమైన తూర్పు ఆఫ్‌షోర్‌ నుండి అధిక ఉత్పత్తి కారణంగా సహజ వాయువు ఉత్పత్తి 6.6 శాతం పెరిగి 2.82 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల (బీసీఎం)కు చేరుకుంది. ఓఎన్‌జీసీ సహజ వాయువు ఉత్పత్తి ఒక శాతం తగ్గి 1.72 బీసీఎంగా నమోదయ్యింది. అయితే తూర్పు ఆఫ్‌షోర్‌ అవుట్‌పుట్‌ 43 శాతం పెరిగి 0.6 బీసీఎంలకు చేరినట్లు డేటా పేర్కొంటోంది. క్షేత్రం వారీగా ఉత్పత్తి వివరాలు తెలియరాలేదు.  

రిఫైనరీల పరిస్థితి ఇలా... 
డిమాండ్‌ మెరుగుపడ్డంతో రిఫైనరీలు ఏప్రిల్‌లో 8.5 శాతం ఎక్కువ ముడి చమురును ప్రాసెస్‌ చేశాయి. ఈ పరిమాణం 21.6 మిలియన్‌ టన్నులు గా ఉంది.  ప్రభుత్వ రంగ రిఫైనరీలు 12.8 శాతం ఎక్కువ ముడి చమురును ఇంధనంగా మార్చాయి. ప్రైవేట్, జాయింట్‌ సెక్టార్‌ యూనిట్ల క్రూడ్‌ ఉత్పత్తి 1.8 శాతం పెరిగింది. రిఫైనరీలు ఏప్రిల్‌లో 22.8 మిలియన్‌ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులు జరి పాయి. 2021 ఇదే నెలతో పోల్చితే ఇది  9 శాతం అధికం. ప్రభుత్వ రంగ యూనిట్ల నుండి ఇంధన ఉత్పత్తి దాదాపు 12 శాతం పెరిగి 13 మిలియన్‌ టన్నులకు చేరుకోగా, ప్రైవేట్‌ రంగ యూనిట్లు 7 శాతం అధికంగా 9.6 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి చేశాయి. ఏప్రిల్‌లో ఇంధన డిమాండ్‌ను తీర్చడానికి రిఫైనరీలు వాటి స్థాపిత సామర్థ్యంలో 104.5 శాతంతో పనిచేశాయి. 

కేంద్రం నజర్‌
దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికిగాను  చమురు, గ్యాస్‌ దేశీయ ఉత్పత్తిని పెంచడంపై కేంద్రం మరోవైపు దృష్టి సారిస్తోంది. భారతదేశం తన చమురు అవసరాలలో 85 శాతం, సహజ వాయువు అవసరాలలో సగం దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. 

చదవండి: ప్లీజ్‌.. భారత్‌ను బతిమాలుతున్నాం, ఆ నిషేధాన్ని ఎత్తేయండి: ఐఎంఎఫ్‌ చీఫ్‌
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top